ఆగని అసమ్మతి రాగాలు.. కేసీఆర్ కు షాకిస్తున్న నేతలు!!

తెలంగాణ సీఎం, గులాబీ అధినేత కేసీఆర్ రానున్న ఎన్నికల కోసం ఇప్పటినుంచే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని భావించి ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.

అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థుల జాబితా ప్రకటించిన కెసిఆర్ అసంతృప్తులు చల్లబడతారని భావించారు. ఎలాగైనా వారిని బుజ్జగించవచ్చని భావించారు. కానీ అప్పటినుండి ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి రాగాలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల టికెట్ ఇచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థుల పైన అసమ్మతి రాగాలు వినిపిస్తున్నవేళ, అసమ్మతి గళాలను కట్టడి చేయడం గులాబీ అధినేత కేసీఆర్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇక ఈసారి ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన నాయకులు పక్క పార్టీల వంక చూస్తున్నారు. ఇదిలా ఉంటే పార్టీలోనే కొందరు తిరుగు బావుటా ఎగురవేస్తున్నారు.

అయితే తాజాగా మరోమారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు షాక్ తగిలింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ లో ఎమ్మెల్యే అబ్రహంకు బీఫామ్ ఇవ్వొద్దని అసమ్మతి నేతలు సమావేశం నిర్వహిస్తున్నారు. ఒకవేళ ఆయనకు బీఫామ్ ఇస్తే సహకరించకూడదని అసమ్మతి నేతలు భావిస్తున్నారు.ఈ మేరకు అధిష్టానానికి అల్టిమేటం ఇస్తున్నారు.

మరోవైపు వికారాబాద్ నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కు సీఎం కేసీఆర్ టికెట్ ఇస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో వికారాబాద్ లో వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. మెతుకు ఆనంద్ కు టికెట్ ఇవ్వద్దని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రారెడ్డి గట్టిగా పట్టుబడుతున్నారు.

వికారాబాద్ లోని బసంత్ ఫంక్షన్ హాల్ లో అసమ్మతి నాయకులు సమావేశమై అభ్యర్థిని మార్చకపోతే తాము సహకరించేది లేదని తేల్చి చెబుతున్నారు. మెతుకు ఆనంద్ ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్లు గల్లంతు చేస్తామని, ఓడించి తీరుతామని అసమ్మతి నేతలు హెచ్చరిస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల సిట్టింగులకు టికెట్ ప్రకటించడం పైన నిరసన సెగ పెల్లుబుకుతుంది.ఇది గులాబీ పార్టీకి ఏ మేరకు నష్టం చేస్తుంది అనేది ముందు ముందు తెలియనుంది.

Editor