అమరావతి: మంగళగిరిలోని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఛాంబర్ ఎదురుగా ఉన్న 108 కాల్సెంటర్ ఉద్యో గిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఓఎస్టీ, ఆరోగ్యశ్రీ అదనపు సీఈఓ మధుసూదనరెడ్డి చేయిచేసుకున్నారు.
శుక్రవారం అందరూ చూస్తుండగానే మధుసూదనరెడ్డి చేయి చేసుకోవడాన్ని నిరసిస్తూ సుమారు 15 నిమిషాలపాటు సిబ్బంది ‘కాల్స్’ తీసుకోవడం ఆపేశారు. అత్యవసర వైద్య సేవల ఫోన్ కాల్స్ కు అంతరాయం ఏర్పడింది.
అన్నమయ్య జిల్లాలో 108 అంబులెన్సు రాకలో జాప్యం ఏర్పడి రైలు ప్రమాద బాధితుడు మరణించినట్లు వచ్చిన వార్తపై గురువారం సీఎం కార్యాలయం వివరణ కోరింది. దీంతో మధుసూదనరెడ్డి హడావుడిగా 108 కాల్సెంటర్ లోని ఉద్యోగి వద్దకు వచ్చి ప్రశ్నించారు. విధి నిర్వ హణలో నిర్లక్ష్యంగా వ్యవహరించావంటూ దురుసుగా మాట్లాడారు. ఆ తర్వాత సహనం కోల్పోయిన మధుసూధనరెడ్డి ఉద్యోగిపై చేయిచేసుకున్నారు.వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, అధికారులు సుమారు వంద మంది వరకు చూస్తుండగానే జరిగిన ఈ సంఘటన కల కలం రేపింది.
దీనిపై ఆగ్రహంతో సహచర సిబ్బంది కాల్సెంటర్కు వచ్చిన ఫోన్లను 15 నిమి షాలపాటు తీసుకోలేదు. అధికారులు జోక్యం చేసుకుని సిబ్బందికి సర్దిచెప్పడంతో పరిస్థితి అదుపు లోకి వచ్చింది. ఈ సంఘటనపై మధుసూదనరెడ్డికి మెమో ఇవ్వాలని ఆరోగ్యశ్రీ సీఈఓను ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై మధుసూదనరెడ్డి వివరణ కోరగా..అత్యవసరంగా కాల్ చేసిన వారికి సమాధానం ఇవ్వడంలో బాధ్యతారహితంగా వ్యవహరించిన ఉద్యోగిని నిలదీసే క్రమంలో భావో ద్వేగానికి గురయ్యానని అన్నారు.
