దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు, వైసీపీ, వైఎస్సార్టీపీ నేతలు, కార్యకర్తలు నివాళులు అర్పిస్తున్నారు.
వైఎస్ హయాంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో సాగిన పాలన తీరుతెన్నుల్ని వారు గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్సార్ ఉండి ఉండే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్ధితులు ఎలా ఉండేవో చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు వైఎస్సార్ కు నివాళులు అర్పిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లిఖార్జున ఖర్గే కూడా తమ పార్టీ దివంగత సీఎం అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పిస్తూ ఇవాళ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ప్రజా సంక్షేమం కోసం ఆయన ఎలా పనిచేశారో గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ కు ఘనంగా నివాళులు అర్పించిన ఆయన.. దివంగత నేత వారసత్వాన్ని మర్చిపోలేమంటూ చేసిన వ్యాఖ్య చర్చనీయాంశమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రజా జీవితానికి చేసిన కృషిని మనం గుర్తుచేసుకుంటున్నామని మల్లిఖార్జున ఖర్గే ట్వీట్ లో పేర్కొన్నారు. ఆయన దృఢమైన కాంగ్రెస్ వ్యక్తి అని, ఆయన కరుణామయ నాయకత్వం మరియు సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేసాయని గుర్తు చేసుకున్నారు. ఆయన జ్ఞాపకార్థం, మేము అతని వారసత్వాన్ని గౌరవిస్తాము మరియు గొప్ప ప్రజా నాయకుడికి మా నివాళులర్పిస్తున్నామంటూ ట్వీట్ లో ఖర్గే తెలిపారు.
