భారత్ కు పుతిన్ హ్యాండ్ ! ఉక్రెయిన్ లో బిజీ.. రాలేనంటూ..

భారత్-రష్యా మధ్య చిరకాల సంబంధాలు ఉన్నాయి. అగ్రరాజ్యాల్లో ఒకటైన రష్యా భారత్ కు దశాబ్దాలుగా నమ్మకమైన మిత్రదేశంగా ఉంది. గతేడాది మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలోనూ ప్రపంచమంతా రష్యాను టార్గెట్ చేస్తున్నా భారత్ మాత్రం తటస్ధంగా ఉంటోంది.

దీంతో పాటు రష్యాపై ఇతర అగ్రరాజ్యాలుఆంక్షలు విధించినా భారత్ మాత్రం చమురు దిగుమతి చేసుకుంటోంది. దీంతో డిస్కౌంట్ పైనే భారత్ కు రష్యా చమురు అమ్మింది. ఈ నేపథ్యంలో భారత్ కు ఓ కీలక విషయంలో రష్యా హ్యాండిచ్చింది.

భారత్ వేదికగా వచ్చే నెలలో అంతర్జాతీయ జీ20 సదస్సు జరగబోతోంది. ఇందులో భారత్, రష్యాతో పాటు పలు అగ్రరాజ్యాలు, ఇతర దేశాలు కూడా పాల్గొంటున్నాయి. ఈ సదస్సుకు హాజరుకావాలని భారత దేశం నుంచి రష్యాకు కూడా ఆహ్వానం అందింది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ఈ సదస్సుకు హాజరు కావాల్సి ఉంది. కానీ తాను వ్యక్తిగతంగా ఈ సదస్సుకు హాజరు కావడం లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇవాళ ప్రకటించారు.

ఉక్రెయిన్ యుద్ధంతో బిజీగా ఉన్నానని, కాబట్టి జీ20 సదస్సుకు హాజరుకావడం లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ కు సమాచారం ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సెప్టెంబరు 9-10 మధ్య ఇక్కడ జరిగే G20 నేతల సదస్సులో పాల్గొనరని రష్యా అధ్యక్షుడి ప్రెస్ సెక్రటరీ డిమిత్రి పెస్కోవ్ రష్యా మీడియాకు తెలియజేశారు. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభమైన తర్వాత జరిగిన ఇతర ఇటీవలి అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాలకు కూడా పుతిన్ వెళ్లలేదని తెలిపారు. అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఆహ్వానం మేరకు ఆయన టర్కీకి వెళ్లాలని ముందుగా భావించారని, తాజా ప్రకటన ఈ పర్యటనపైనా ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది.

ఉక్రెయిన్‌లో ప్రత్యేక సైనిక ఆపరేషన్ కారణంగా పుతిన్ రావడం లేదని పెస్కోవ్ రష్యన్ మీడియాతో వెల్లడించారు. అధ్యక్షుడు పుతిన్ గత సంవత్సరం బాలిలో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశానికి కూడా హాజరుకాలేదు. అలాగే తాజాగా జోహన్నెస్‌బర్గ్‌లో ముగిసిన 15వ బిక్స్ శిఖరాగ్ర సమావేశానికి దూరంగా ఉన్నారు. బాలి, జోహన్నెస్‌బర్గ్ రెండింటిలోనూ, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ రష్యా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. జీ20 సదస్సు కోసం భారత్‌కు వెళ్లనున్నట్లు ఇప్పటికే పలువురు నేతలు ప్రకటించారు. అధ్యక్షుడు జో బిడెన్ సెప్టెంబర్ 7-10 మధ్య ఢిల్లీలో ఉంటారని వైట్ హౌస్ ప్రకటించింది. ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ కూడా భారత్ కు రానున్నారు.

YES9 TV