ఎట్టకేలకు ఓ చడ్డీగ్యాంగ్ ముఠా సభ్యుడు పోలీసులకు చిక్కాడు.
హఫీజ్పేట, అమీన్పూర్లోని ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న చడ్డీ గ్యాంగ్కు చెందిన వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.
అతడి నుంచి నాలుగు లక్షల రూపాయల విలువైన బంగారాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మాదాపూర్ డీసీపీ జీ సందీప్ మీడియాతో మాట్లాడుతూ.. గుజరాత్లోని దాహోద్ జిల్లాకు చెందిన నలుగురు సభ్యుల ముఠా ఈ దోపిడీకి పాల్పడిందని తెలిపారు. వీరిలో సుర్మాల్ అలియాస్ ప్లాస్ సుమల్భాయ్ కాలియాభాయ్ (20)ను గుజరాత్లోని జునాగఢ్కు చెందిన కేశోద్ పోలీసులు అరెస్టు చేయగా.. నామా ముఖేష్భాయ్ భారుభాయ్ (27)ని సైబరాబాద్ పోలీసులు లింగంపల్లి రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు.
అయితే, ఇద్దరు నిందితులు విక్రంభాయ్ దరియాభాయ్ పర్మార్, హనియా నితిన్భాయ్ పరారీలో ఉన్నారు. హైదరాబాద్లో ప్లంబర్గా పనిచేస్తున్న విక్రంభాయ్ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి వాటిలోకి చొరబడేందుకు పథకం రచిస్తాడు. గుజరాత్కు చెందిన మిగతా ముగ్గురు నిందితులను ఈ దోపిడీలకు పిలుస్తాడు.
ఇంటిని ఎంపిక చేసుకున్న తర్వాత రాత్రి వరకు సమీపంలోని లొకేషన్లో తలదాచుకునేవారు నిందితులు. రాత్రి సమయంలో, వారు తమ లోదుస్తులు, బనియన్లు ధరించి, వారి ముఖాలను రుమాలుతో కప్పి, వారి చేతుల్లో పాదరక్షలను పట్టుకుని దొంగతనాలకు పాల్పడేవారు.
చడ్డీ బనియన్ గ్యాంగ్ అనేది భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేసే గ్యాంగ్. లోదుస్తులు మాత్రమే ధరించి దాడులు నిర్వహించే వారి ప్రత్యేక కార్యాచరణ కారణంగా, వారిని ‘చడ్డీ బనియన్’ గ్యాంగ్ అని పిలుస్తారు. వారి లోదుస్తులతో పాటు, వారు ముఖానికి ముసుగులు వేసుకుంటారు. ఎవరికీ చిక్కకుండా నూనె లేదా మట్టి శరీరానికి రాసుకుంటారు.
