ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో డీఎస్సీ ద్వారా 5089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది.
2575 ఎస్జీటీ, 1739 స్కూల్ అసిస్టెంట్, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టుల భర్తీకి అనుమతి మంజూరు చేసింది.
ఈ మేరకు ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈసారి టీఎస్ పీఎస్సీ ద్వారా కాకుండా గతంలో మాదిరిగా జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్సీ)లు నియామకాలు చేపడతాయని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ ప్రకారం టెట్ క్వాలిఫై అయిన వారంతా టీఆర్టీకి పోటీ పడేందుకు అర్హులు. అందులో అర్హత సాధించిన వారి వివరాలతో జిల్లాలవారీ జాబితాను రూపొందించి డీఎస్సీకి పంపుతారు. ఆ తర్వాత ఆయా జిల్లాల డీఎస్సీలు నియామకాలు చేపడతాయి.
ఈ మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు.
విద్యారంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. ఈ ఏడాది విద్యారంగానికి రూ.29,613 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. గురుకులాల్లో మనందరం గర్వపడేలా సత్ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. కొన్ని గురుకులాలను డిగ్రీ కాలేజీ స్థాయికి అప్గ్రేడ్ చేశామని మంత్రి తెలిపారు.
గురుకులాల్లో 11,714 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే 5,310 టీచర్ పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను ఇప్పటికే క్రమబద్ధీకరించామని చెప్పారు. అన్ని స్థాయిల విద్యాసంస్థల్లో మరిన్ని పోస్టులను భర్తీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇంటర్, డిగ్రీ స్థాయిల్లో 3,140 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. మిగిలిన ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టామన్నారు.
