చంద్రుడి ఉపరితలంపై నడకను మొదలుపెట్టిన ప్రజ్ఞాన్ రోవర్

భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. జాబిల్లిపై తన అసలు పనికి ఇప్పుడే శ్రీకారం చుట్టింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ నుంచి ఇదివరకే బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టిన ప్రజ్ఞాన్ రోవర్..

తన పని తాను చేసుకోవడాన్ని మొదలు పెట్టింది.

దీనికి సంబంధించిన కీలక అప్‌డేట్‌ను వెల్లడించింది ఇస్రో. ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలపై తన నడకను ఆరంభించినట్లు తెలిపింది. మూన్ వాక్ మొదలు పెట్టిన రోవర్‌తో బెంగళూరులోని మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్‌తో అనుసంధానం ఏర్పడిందని వివరించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా ఇస్రో విడుదల చేసింది.

తాజాగా మరో అప్‌డేట్‌ను వెలువడించింది. చంద్రుడి ఉపరితలంపై నడకను మొదలుపెట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. తొలి రోజున ఎనిమిది మీటర్ల పాటు ప్రయాణించింది. విక్రమ్ మాడ్యుల్ ర్యాంప్ మీదుగా కిందికి దిగిన తరువాత రోవర్ కొంత సమయం పాటు కదల్లేదు. ఉపరితలాన్ని అధ్యయనం చేయడానికే దీన్ని కొంతసేపు పాజ్‌లో ఉంచారు ఇస్రో శాస్త్రవేత్తలు.

ఆ తరువాత- రోవర్ ముందుకు కదిలేలా సంకేతాలను పంపించారు. దీనికి అనుగుణంగా అది రియాక్ట్ అయింది. సంకేతాలు అందిన క్షణం నుంచి రోవర్ కదలికలు మొదలు పెట్టింది. ఇప్పటి వరకు ఎనిమిది మీటర్ల పాటు ముందుకు సాగింది. తొలి రోజున ఎనిమిది మీటర్ల పాటు ప్రయాణం సాగించినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు వివరించారు.

ఇక రోవర్‌ ద్వార చంద్రుడి మీదికి పంపించిన పేలోడ్స్ అన్నీ కూడా సక్రమంగా పని చేస్తోన్నాయని ఇస్రో శాస్త్రవేత్తలు వివరించారు. పేలోడ్స్ అన్నీ స్విచ్ ఆన్ అయ్యాయని తెలిపారు. వాటి ద్వారా చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన పూర్తి సమాచారం, డేటా త్వరలో అందుతుందని పేర్కొన్నారు.

రోవర్‌లో లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్, ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్‌ను పేలోడ్స్‌గా పంపించారు శాస్త్రవేత్తలు. అవన్నీ ప్రణాళికాబద్ధంగా పని చేస్తోన్నాయని తెలిపారు. రోవర్ 8 మీటర్ల దూరాన్ని విజయవంతంగా అధిగమించిందని, ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, రోవర్‌లోని అన్ని పేలోడ్స్ పనితీరు సంతృప్తికరంగా ఉందని అన్నారు.

YES9 TV