తిరుపతి: ప్రతిష్ఠాత్మక టీటీడీ పాలక మండలికి కొత్త ఛైర్మన్గా తిరుపతి శాసన సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మధ్యాహ్నమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పేరును ఖరారు చేశారు.
వైవీ సుబ్బారెడ్డి కాల పరిమితి ఈ నెల 8వ తేదీన ముగిసిన నేపథ్యంలో- ఆయన స్థానంలో భూమన పేరును ప్రకటించారు.
భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ ఛైర్మన్గా నియమిస్తూ ఇదివరకే జీఓ నంబర్ 380 వెలువడింది. ఈ మేరకు రెవెన్యూ (దేవాదయం) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవేన్ ఈ జీఓను జారీ చేశారు. ఈ నెల 8వ తేదీ నుంచి కొత్త పాలక మండలి మనుగడలోకి వచ్చింది.
భూమన కరుణాకర్ రెడ్డి.. రెండోసారి టీటీడీ ఛైర్మన్గా అపాయింట్ అయినట్టయింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన ఒకసారి టీటీడీ ఛైర్మన్గా పని చేశారు. ఆయన హయాంలోనే దళిత గోవిందం.. వంటి కీలక పథకాలను టీటీడీ ప్రవేశపెట్టింది.
2006 నుంచి 2008 వరకు టీటీడీ చైర్మన్గా పని చేశారు భూమన. 2012లో తిరుపతి అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014 ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. 2019లో మళ్లీ వైసీపీ నుంచి విజయం సాధించారు. ఈ సారి ఎన్నికల్లో తన కుమరుడికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు.
తాజాగా- 24 మందితో కూడిన పాలక మండలిని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేశారు. ఈ జాబితా కొద్దిసేపటి కిందటే విడుదలయింది. పలువురు ఆధ్యాత్మిక, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులకు చోటు దక్కింది ఇందులో.
పొన్నాడ వెంకట సతీష్, సామినేని ఉదయభాను, ఎం తిప్పేస్వామి, సిద్ధవటం యాదయ్య, చందే అశ్వర్థ నాయక్, మేకా శేషుబాబు, ఆర్ వెంకటసుబ్బారెడ్డి, ఎల్లారెడ్డిగారి సీతారామా రెడ్డి, గాదిరాజు వెంకట సుబ్బరాజు, పెనక శరత్ చంద్రారెడ్డి, సాముల రామ్ రెడ్డి, బాలసుబ్రమణియన్ పళనిస్వామి, ఎస్ఆర్ విశ్వనాథ్ రెడ్డి, గడ్డం సీతారెడ్డి ఉన్నారు.
కృష్ణమూర్తి వైద్యనాథన్, సిద్ధా వీర వెంటక సుధీర్ కుమార్, సుదర్శన్ వేణు, నెరుసు నాగ సత్యం, ఆర్వీ దేశ్ పాండే, అమోల్ కాలే, డాక్టర్ ఎస్ శంకర్, మిలింద్ కేశవ్ నర్వేకర్, డాక్టర్ కేతన్ దేశాయ్, బోరా సౌరభ్లకూ చోటు దక్కింది. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలకు చెందిన ప్రతినిధులకు ట్రస్ట్ బోర్డులో స్థానం కల్పించింది ప్రభుత్వం.
