ఏపీలో రాజకీయ పార్టీలకు ఈసీ మరో షాక్ ?

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఓట్ల తొలగింపుల ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ విపక్షాల ఓట్లను తొలగించేందుకు భారీగా ఫామ్ 7ను వాడి ఫిర్యాదాలు చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఇప్పటికే గతేడాది జనవరి నుంచి తొలగించిన ఓట్లను తిరిగి పరిశీలించేందుకు ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఈ కార్యక్రమం కొనసాగుతుండగానే తాజాగా జిల్లా కలెక్టర్లకు మరో కీలక ఆదేశం కూడా ఇచ్చింది.

రాష్ట్రంలో తప్పుడు ఫిర్యాదులతో ఇతరుల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నించినట్లు తేలితే సదరు వ్యక్తుల్ని, రాజకీయ నేతల్ని, కార్యకర్తలపై ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా తాజాగా ఆదేశాలు ఇచ్చారు. ఇందుకోసం పలు మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. వీటి ఆధారంగా నకిలీ ఫిర్యాదుల్ని తేల్చాలని కలెక్టర్లను ఆదేశించారు.

నకిలీ ఓట్ల తొలగింపు కోరుతూ ఓ వ్యక్తి ఐదుకంటే ఎక్కువ ఫిర్యాదులు ఇస్తే ఏఈఆర్వో, బీఎల్వో, డిప్యూటీ తహసీల్డార్ తో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి క్షేత్రస్ధాయి పరిశీలన చేయాలన్నారు. ఈ కమిటీ విచారణకు రాజకీయ పార్టీల బీఎల్ఏలను, ఫిర్యాదు చేసిన వ్యక్తికి నోటీసులు జారీ చేసి పిలిపించాలి. త్రిసభ్య కమిటీ విచారణ తర్వాత ఈఆర్వో వ్యక్తిగతంగా పరిశీలించి ఫిర్యాదు నిజమేనని తేలితే ఓట్లు తొలగించాలని, తప్పని తేలితే వాస్తవమేంటో రిపోర్టు ఇవ్వాలన్నారు.

అలాగే తప్పుడు డిక్లరేషన్ తో ఓట్ల తొలగింపు కోసం ఫిర్యాదు చేసిన వ్యక్తిపై ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 31 ప్రకారం కేసు నమోదు చేయాలని సీఈవో సూచించారు. నేరం రుజువైతే గరిష్టంగా ఏడాది జైలు, జరిమానా కూడా విధించాలన్నారు. ఫారం 6తో పాటు ఇతర దరఖాస్తుల విషయంలోనూ ఇదే విధానం అమలు చేయాలని ఆదేశించారు. అలాగే ఈ ఉత్తర్వుల్ని కలెక్టర్లు.. ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, బీఎల్వోలకు పంపించి కచ్చితంగా అమలయ్యేలా చూడాలన్నారు.

Posted Under AP
Editor