ఆదిలాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో.. అధికార భారత్ రాష్ట్ర సమితి సమర శంఖాన్ని పూరించింది. అన్ని పార్టీల కంటే ముందుగా.. అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.
111 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. కొద్దిసేపటి కిందటే విడుదల చేశారు.
కేసీఆర్.. రెండు నియోజకవర్గాల నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు. తన కంచుకోట గజ్వేల్తో పాటు కొత్తగా కామారెడ్డిని ఎంచుకున్నారాయన. కేసీఆర్ తనయుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. ఎప్పట్లాగే సిరిసిల్ల నుంచి పోటీ చేయనున్నారు. సిద్ధిపేట్ నుంచి మంత్రి హరీష్ రావు రేసులో నిలిచారు.
ఈ జాబితా వెలువడిన తరువాత క్రమంగా ఇక అసమ్మతి చెలరేగుతోంది. టికెట్ దక్కని నాయకులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తోన్నారు. జాబితాలో తమ పేరు గల్లంతు కావడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం పార్టీని వీడే దిశగా అడుగులు వేస్తోన్నారు. ఈ క్రమంలో తొలి వికెట్ పడింది కూడా.
నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న బీఆర్ఎస్ శాసన సభ్యురాలు అజ్మీరా రేఖా నాయక్.. పార్టీకి గుడ్బై చెప్పే యోచనలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ.. ఆమెకు టికెట్ దక్కలేదు. దీనితో పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం.
ఈ క్రమంలో రేఖా నాయక్ భర్త అజ్మీరా శ్యామ్ నాయక్.. కొద్దిసేపటి కిందటే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ రావ్ థాకరేను కలుసుకున్నారు. ఆయన చేతుల మీదుగా కాంగ్రెస్ కండువాను కప్పుకొన్నారు. దీనితో ఇక రేఖా నాయక్ కూడా కాంగ్రెస్లో చేరొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఖానాపూర్ ఎస్టీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి రేఖా నాయక్ వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. 2014, 2018లో భారీ మెజారిటీతో తన ప్రత్యర్థి రమేష్ రాథోడ్ను మట్టికరిపించారు. 2014లో టీడీపీ తరఫున, 2018లో కాంగ్రెస్ తరఫున రమేష్ రాథోడ్ పోటీ చేసి, రేఖా నాయక్ చేతిలో ఓటమి చవి చూశారు.
కేసీఆర్ తాజాగా విడుదల చేసిన జాబితాలో రేఖా నాయక్ పేరు గల్లంతయింది. ఆమెకు బదులుగా ఖానాపూర్ టికెట్ను భుక్యా జాన్సన్ రాథోడ్ నాయక్కు ఇచ్చారు. పార్టీ క్యాడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురుకావడం, నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు రేఖానాయక్పై తీవ్ర అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో కేసీఆర్.. ఆమెను తప్పించారని చెబుతున్నారు.
