బ్రిటిష్‌ రాజప్రసాదం కంటే నాలుగు రెట్లు ఉండే మన లక్ష్మీ విలాస్‌ ప్యాలెస్‌.. విశేషాలు తెలుసా?

అనేక అద్భుతమైన భవనాలకు నిలయం మన భారతదేశం. ఎంతో ఖరీదైన విలాసవంతమైన యాంటిలియా భవనం ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్‌ అంబానీకి చెందినది.

ఇది ప్రపంచంలోనే రెండవ అత్యంత ఖరీదైన ఇల్లుగా ప్రసిద్ధి. అయితే యాంటిలియాను మించి భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ నివాసం ఉందని మీకు తెలుసా? అంతే కాదు, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్‌ నివాసం. యాంటిలియా విస్తీర్ణం 48,780 చదరపు అడుగులు కాగా, ఈ నివాసం విస్తీర్ణం యాంటిలియా కంటే ఎంతో అధికం. ఇది బరోడాలోని మరాఠా రాజ కుటుంబానికి చెందిన నివాసం లక్ష్మీ విలాస్‌ ప్యాలెస్‌. బ్రిటిష్‌ రాజకుటుంబం, ప్రధాన నివాసమైన బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ కంటే లక్ష్మీ విలాస్‌ ప్యాలెస్‌ నాలుగు రెట్లు పెద్దది. లక్ష్మీ విలాస్‌ ప్యాలెస్‌ ప్రస్తుత విలువ దాదాపు రూ.24,000 కోట్లు.

1890లో నిర్మాణం..
వడోదరలోని ఈ లక్ష్మీ విలాస్‌ ప్యాలెస్‌ను 1890లో మహారాజా సాయాజీరావ్‌ గైక్వాడ్‌ రూ. 27,00,000తో నిర్మించారు. అప్పట్లో ఇది చాలా పెద్ద మొత్తం. ఇది 828,821 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంది. 700 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ విలాసవంతమైన ప్యాలెస్‌ను మేజర్‌ చార్లెస్‌ మాంట్‌ రూపొందించారు. ఆ కాలంలోని గొప్ప వాస్తుశిల్పుల్లో ఒకరు మేజర్‌ చార్లెస్‌. ఈ ప్యాలెస్‌ ఇండో-సార్సెనిక్‌ నిర్మాణ శైలిని కలిగి ఉంది. వెలుపలి భాగాలు అద్భుతమైన డిజైన్‌తో నిర్మించారు. ప్యాలెస్‌ లోపలి భాగాన్ని సున్నితమైన మొజాయిక్‌లు, విలువైన కళాఖండాలతో అలంకరించారు. 1930వ దశకంలో మహారాజా ప్రతాప్‌ సింహా యూరోపియన్‌ అతిథుల కోసం ప్యాలెస్‌ మైదానంలో గోల్ఫ్‌ కోర్సును కూడా నిర్మించారు.

అరుదైన పెయింటింగ్స్‌..
మహారాజా ఫతే సింగ్‌ మ్యూజియంలో అనేక అరుదైన రాజా రవివర్మ పెయింటింగ్స్, ఒక చిన్న రైల్వే ఉన్నాయి. ఈ భవనం రాజ కుటుంబానికి చెందిన పిల్లలకు పాఠశాలగా ఉపయోగించేవారు. ఈ రైలు మార్గం పాఠశాల, ప్యాలెస్‌కు సులభంగా ప్రయాణించడానికి అనుసంధానం చేస్తూ నిర్మించారు.. ఆ రోజుల్లో ఈ ప్యాలెస్‌ కోసం లిఫ్టులు కూడా నిర్మించబడ్డాయి. అప్పట్లో లిఫ్ట్‌లు చాలా అరుదు. ఈ ప్యాలెస్‌లో 170 గదులు ఉన్నాయి. మాజీ రంజీ ట్రోఫీ ఆటగాడు సమర్జిత్‌ సింగ్, ఇతడు మహారాజా ప్రతాప్‌సింహ మనవడు ఈ ప్యాలెస్‌ని పునరుద్ధరించిన తర్వాత ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి తెచ్చారు. ప్యాలెస్‌ మైదానంలో మోతీ బాగ్‌ ప్యాలెస్, మహారాజా ఫతే సింగ్‌ మ్యూజియం భవనం, విలాసవంతమైన ఎల్‌వీపీ విందులు, సమావేశాలతో సహా అనేక భవనాలు ఉన్నాయి. మోతీ బాగ్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ ఇక్కడ మ్యూజియం ప్రక్కనే ఉంది. ప్రసిద్ధ బరోడా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యాలయంతో ప్రతిష్టాత్మకమైన చిరునామా. ఈ ప్యాలెస్‌ ఇప్పుడు హెచ్‌ఆర్‌హెచ్‌ సమర్జిత్‌ సింగ్‌ గైక్వాడ్, అతని భార్య రాధికారాజే గైక్వాడ్, వారి ఇద్దరు కుమార్తెలకు నిలయంగా ఉంది.

అద్భుత శిల్పకళ..
లక్ష్మీ విలాస్‌ ప్యాలెస్‌లో ప్రపంచంలోని ఇతర ప్యాలెస్‌ల కంటే ఎక్కువ గాజు కిటికీలు ఉన్నాయని చెబుతారు. వీటిలో ఎక్కువ భాగం బెల్జియం నుంచి తీసుకువచ్చారు. దర్బార్‌ వెలుపల నీటి ఫౌంటెయిన్‌లు ఇటాలియన్‌ ప్రాంగణంలో ఉంది. క్యూ గార్డెన్స్‌కు చెందిన స్పెషలిస్ట్‌ విలియం గోల్డ్‌రైట్చే మైదానం ప్రకృతి ప్రతిబింబాన్ని తలపిస్తుంది. ప్యాలెస్‌ ఫెలిస్‌ కాంస్య, పాలరాయి, టెర్రకోటలో పురాతన ఆయుధాలు, శిల్పాల అద్భుతమైన సేకరణ ఇక్కడ మరింత అట్రాక్షన్‌గా నిలస్తుంది. కచేరీలు, ఇతర సాంస్కృతిక సమావేశాల కోసం ఉపయోగించే దర్బార్‌ హాల్‌లో వెనీషియన్‌ మొజాయిక్‌ ఫ్లోరింగ్, బెల్జియన్‌ స్టెయిన్డ్‌ గ్లాస్‌తో కూడిన కిటికీలు దాని ప్రధాన లక్షణాలలో ఒకటిగా ఉన్నాయి. 1982 చిత్రం ప్రేమ్‌ రోగ్, 1993లో దిల్‌ హాయ్‌ తో హై, 2016లో సర్దార్‌ గబ్బర్‌ సింగ్, 2013లో గ్రాండ్‌ మస్తీ వంటి అనేక బాలీవుడ్‌ సినిమాల షూటింగ్‌ ఇక్కడే జరిగింది.

YES9 TV