సాధారణంగా ప్రైవేట్ ట్రావెల్స్ డిమాండ్ బట్టి టికెట్ ధరలు పెంచడం లేదా తగ్గిస్తుంటారు. అంటే డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు టికెట్ ధరలు పెంచుతారు. డిమాండ్ తక్కువగా ఉంటే టికెట్ ధరలు తగ్గిస్తారు.
పండుగల సీజన్ లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి టికెట్ రేట్లు పెంచుతారు. మిగతా రోజుల్లో తగ్గిస్తారు. ఇలా వీరు లాభాలు ఆర్జిస్తుంటారు. అయితే నష్టల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీ కూడా ఇదే పద్ధతి ఫాలో కావాలని చూస్తుందట. కొన్ని ప్రత్యేక రూట్లలో డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని అమలు చేయాలని భావిస్తుంది.
డైనమిక్ ప్రైసింగ్ అంటే డిమాండు ఉన్నప్పుడు టికెట్ ధర ఎక్కువగా.. డిమాండ్ తగ్గితే టికెట్ ధర తక్కువగా ఉంటుంది. ఈ విధానం ప్రకారం టికెట్లు ఎక్కువగా బుక్ అయితే ఆటోమేటిక్ గా టికెట్ల ధరలు పెరుగుతాయి. ఈ డైనమిక్ విధానాన్ని హైదరాబాద్-తిరుపతి రూట్ లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ విధానంలో స్లీపర్ బస్సుల్లో లోయర్ బెర్త్లకు ఎక్కువ టిక్కెట్ చార్జీలు తీసుకునే అవకాశం ఉంది. సీటింగ్ మాత్రమే ఉన్న సర్వీసుల్లో డ్రైవర్ వెనుక మొదటి వరుస సీట్లు, చివరి రెండు వరుసల బస్సులు మినహా టికెట్ చార్జీలు ఎక్కువగా ఉండే ఛాన్సు కూడా ఉంటుందట.
హైదరాబాద్ నుంచి తిరుపతి, విజయవాడకి టీఎస్ఆర్టీసీ ఎక్కువగా బస్సు సర్వీసులు నడుపుతోంది. హైదరాబాద్ నుంచి తిరుపతి టికెట్ ధరలు చూసుకుంటే.. సూపర్ లగ్జరీకి రూ.1060 తీసుకుంటున్నారు. రాజధానికి రూ.1,340 వసూలు చేస్తున్నారు. గరుడ ప్లస్ బస్సులకు రూ.1,580 ఛార్జ్ చేస్తున్నారు. లహరి ఏసీ స్లీపర్ బస్సుకు రూ.2,150 తీసుకుంటున్నారు. డైనమిక్ విధానం అమలు చేస్తే టికెట్ల ధరలు పెరిగే అవకాశం ఉంది.
ఆర్టీసీ బస్సుల్లో ప్రస్తుత టిక్కెట్ ధరలపై 25 శాతం పెరగొచ్చు.ప్రైవేట్ ఆపరేటర్లు నిర్ణయించే టిక్కెట్ ధరలను ఆధారంగా ఆర్టీసీ బస్సుల టిక్కెట్ ధరలను నిర్ణయించే అవకాశం ఉంది. డైనమిక్ ప్రైస్ విధానం గతంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచ విజయవాడకు అమలు చేశారు. దీని వల్ల ఆర్టీసీకి ఆదాయం వచ్చినట్లు తెలిసింది.
