Latest Posts

అజిత్ పవార్ ఇప్పుడు సీఎం పదవిపై కన్నేశారు

మహారాష్ట్రలో ఎన్సీపీని చీల్చి, బీజేపీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎం అయిన అజిత్ పవార్ ఇప్పుడు సీఎం పదవిపై కన్నేశారు. అదే సమయంలో ఎన్సీపీ రాక తర్వాత గతంలో శివసేనను చీల్చి సీఎం అయిన ఏక్ నాథ్ షిండేతో పాటు బీజేపీ ఎమ్మెల్యేల్లోనూ అసంతృప్తి పెరిగిపోతోంది.

ఎన్సీపీతో ఇన్నాళ్లు పోరాడిన తాము బీజేపీ అధిష్టానం నిర్ణయంతో ఇప్పుడు అజిత్ పవార్, ఇతర నేతలతో కలిసి పనిచేయాల్సి రావడంపై రగిలిపోతున్నారు.

ఈ నేపథ్యంలో అజిత్ పవార్ ఎంట్రీతో సీఎం ఏక్ నాథ్ షిండే పదవికి ముప్పు తప్పదని శివసేనలోని ఉద్ధవ్ థాక్రే వర్గం అంచనా వేస్తోంది. త్వరలో బీజేపీ షిండేతో సీఎం పదవికి రాజీనామా చేయిస్తుందని మాజీ మంత్రి, ఉద్ధవ్ తనయుడు ఆదిత్యథాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కొన్ని రోజుల ముందు ఆదిత్య చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.

ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో పెద్ద మార్పు వస్తుందని ఆదిత్యథాక్రే ఇవాళ వెల్లడించారు. అజిత్ పవార్, మరో ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఆయన కేబినెట్లో చేరిన తర్వాత షిండే ముఖ్యమంత్రి కుర్చీ ప్రమాదంలో పడవచ్చని థాక్రే అంచనా వేశారు.

ఇప్పటికే షిండేను రాజీనామా చేయాల్సిందిగా బీజేపీ కోరిందని ఆదిత్య తెలిపారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) తిరుగుబాటుదారుడు అజిత్ పవార్ అతని అనుచరులు ప్రభుత్వంలో చేరిన తర్వాత బిజెపి ఏక్‌నాథ్ షిండే గ్రూపును పక్కనపెడుతోందనే ప్రచారం నేపథ్యంలో ఆదిత్య థాకరే ఈ వ్యాఖ్యలు చేశారు.

YES9 TV