ఒడిశాలో నిన్న రాత్రి మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య 288కి చేరుకుంది. ఘటనా స్ధలిలో సహాయక చర్యలు పూర్తయ్యాయి. దీంతో రైల్వే అధికారులు ట్రాక్ ల పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నేతలు, మాజీ రైల్వే మంత్రులు సైతం ఈ ఘటనపై స్పందిస్తున్నారు. ఇదే క్రమంలో మాజీ రైల్వే మంత్రి మమతా బెనర్జీ ఘటనా స్ధలికి వచ్చి పరిస్ధితిని సమీక్షించారు. అనంతరం మరో మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ ఘటనపై స్పందించారు.
రైల్వేల్ని కేంద్ర ప్రభుత్వం నాశనం చేసిందని, దీని ఫలితమే ఇవాళ ఒడిశాలో జరిగిన ప్రమాదమని మాజీ రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ విమర్శించారు. ఒడిశా ఘటన దురదృష్టకరమని, దీనిపై అత్యున్నత స్ధాయిలో విచారణ జరిపి దోషుల్ని శిక్షించాలని లాలూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లాలూ యాదవ్ కేంద్రంపై పరోక్ష విమర్శలు గుప్పించారు. ఎక్కడా కేంద్రం పేరెత్తకుండానే రైల్వేల్ని నాశనం చేశారని విమర్శించారు. వీరి నిర్లక్ష్యంతో ఇవాళ భారీగా ప్రాణనష్టం జరిగిందన్నారు.
ఒడిశా రైలు ప్రమాద ఘటనలో దారుణ నిర్లక్ష్యం ఉందని లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపించారు. దీనిపై అత్యున్నత విచారణ జరిపిస్తే తప్ప వాస్తవాలు బయటికి రావన్నారు. వెంటనే విచారణ చేపట్టి బాధ్యుల్ని శిక్షించాలని లాలూ కోరారు. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని మోడీ ఇప్పటికే బాలాసోర్ ఆస్పత్రులకు వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. ఇందుకు కారకులైన వారిని శిక్షిస్తామని హెచ్చరించారు.
