వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు ముదురుతోంది. నిన్నటికి నిన్న వరంగల్ డిసిసి అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో, ఫ్లెక్సీలలో కొండా మురళి దంపతుల ఫోటోలు పెట్టలేదని కొండ మురళి అనుచరులు ఆందోళనకు దిగారు.
దీంతో కొండా మురళి అనుచరులకు, ఎర్రబెల్లి స్వర్ణ అనుచరులకు మధ్య ఘర్షణ జరగగా, కార్యకర్తలు చొక్కాలు చించుకుని, చెప్పులతో కొట్టుకున్నారు. దీంతో కార్యక్రమమంతా రసాభాసగా మారింది.
ఎర్రబెల్లి స్వర్ణ భర్త రాజేశ్వరరావు గొడవ పడ్డ వాళ్ళ అంతు చూస్తాం అని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక ఈ ఘటనపై స్పందించిన కొండా మురళి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. తమ కార్యకర్తలను ఎవరైనా టచ్ చేస్తే తనలో ఉన్న పాత మురళి మళ్లీ బయటకు వస్తాడు అంటూ హెచ్చరించారు.
తమ కార్యకర్తల జోలికి వస్తే క్రేన్ కు ఉరి వేసి వేలాడదీస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చారు. వరంగల్ తూర్పు టికెట్ కొండా సురేఖకే అని ఆయన తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారని ఆయన స్పష్టం చేశారు. వరంగల్ తూర్పు టికెట్ విషయంలో బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని ప్రత్యర్థులను గట్టిగా హెచ్చరించారు.
ఇక వరంగల్ కు చెందిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరుతామని తనతో చెబుతున్నారని పేర్కొన్న కొండా మురళి కానీ వారిని పార్టీలోకి తీసుకోవాలా వద్దా అనేది పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. మొత్తానికి డి సి సి అధ్యక్ష పదవి కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలకు కారణమైంది. ఎర్రబెల్లి స్వర్ణ వర్సెస్ కొండా సురేఖ అన్నట్టు ప్రస్తుతం వరంగల్ తూర్పులో వార్ కొనసాగుతుంది.
మరో నాలుగైదు నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తుంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలందరూ ఐకమత్యంతో పని చేయాల్సిన చోట, వారిలో వారే గ్రూపు రాజకీయాలు చేస్తూ, అంతర్గత కుమ్ములాటలకు పాల్పడటం, బాహాటంగానే గొడవలకు దిగి రచ్చ చేయడం కాంగ్రెస్ శ్రేణులకు ఏమాత్రం నచ్చడం లేదు. మరి దీనిపై పార్టీ అధినాయకత్వం దృష్టి సారించి వరంగల్లో నేతల మధ్య సయోధ్య కుదురుస్తారా? లేదంటే ఈ పంచాయతీ మరింత ముదురుతుందా? అనేది తెలియాల్సి ఉంది.
