హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. ఆదివారం మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా..
ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి సూర్యుని వేడితో అల్లాడుతున్న నగర జనం.. వర్షం కురవడంతో ఉపశమనం పొందారు. మరోవైపు, పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కూకట్పల్లి, అమీర్పేట్, ఖైరతాబాద్, కేపీహెచ్బీ, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ఆ ప్రాంతాల ప్రజలకు తిప్పలు తప్పలేదు.
మరోవైపు, రానున్న మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గరిష్టంగా 40 నుంచి 43 డిగ్రీ సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, ఆది, సోమవారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇది ఇలావుండగా, హార్యానా, ఈశాన్య రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు నాలుగు రోజులపాటు ఢిల్లీలో వర్షాలతోపాటు పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ఆరేబియా సముద్రం నుంచి తేమ కారణంగా ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, వాయువ్య భారతదేశంలో కూడా ఇదే విధమైన వాతావరణం ఉంటుందని పేర్కొంది. రానున్న ఐదు రోజులపాటు ఈశాన్య భారతదేశంలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.
