ప్రధాని మోడీ తన పట్టాభిషేకంలా భావిస్తున్నారు: కొత్త పార్లమెంటుపై రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పట్టాభిషేకంలా భావిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.

పార్లమెంట్ ప్రజల గళమని అన్నారు. ప్రదాని మోడీ కొత్త పార్లమెంట్ ప్రారంభించిన కాసేపటికే రాహుల్ ట్విట్టర్ వేదికగా విమర్శలు ఎక్కుపెట్టారు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ వేడుకలను కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు బహిష్కరించిన విషయం తెలిసిందే.

రాహుల్ తోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు. కొత్త పార్లమెంట్ భవనానికి పునాది రాయి వేసిన సమయంలోనూ అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను దూరం పెట్టారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. ఇప్పుడు ప్రారంభోత్సవ వేడుకలకు ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పక్కన పెట్టారని విమర్శించారు. ఇది ఆర్ఎస్ఎస్ ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తోందని వ్యాఖ్యానించారు. ఆయా రాజ్యాంగబద్ధ పదవులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారంటూ విమర్శించారు. కానీ, చరిత్రాత్మక కార్యక్రమాల్లో మాత్రం వారికి భాగస్వామ్యం కల్పించడం లేదని ధ్వజమెత్తారు.

కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి మోడీ : ఆధునిక హంగులతో ఏర్పాటైన కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోడీ ఆదివారం ఉదయం ప్రారంభించారు. హోమం, రాజదండం, ప్రతిష్టాపన, సర్వమత ప్రార్థనల మధ్య ప్రారంభోత్సవ వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేడుకల్లో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతోపాటు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్, కేంద్రమంత్రులు, ఎంపీలు, పలువురు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు.

“ఈ కొత్త కాంప్లెక్స్ స్వావలంబన భారతదేశానికి నిదర్శనం” అని ప్రధాని మోడీ తన ప్రసంగంలో అన్నారు. మరోవైపు, కొత్త కాంప్లెక్స్‌ను ప్రారంభించేందుకు మోడీ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని, దేశంలోని అత్యున్నత కార్యనిర్వాహక అధికారి అయిన రాష్ట్రపతిని విస్మరించారని.. 20 ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి.

YES9 TV