హైదరాబాద్లో నాలుగోరోజు ఐటీ రైడ్స్; ఆ సంస్థలు జల్లెడ; భారీగా నగదు స్వాధీనం!!

హైదరాబాద్లో గత నాలుగు రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. బుధవారం నాడు మొదలైన ఐటీ సోదాలు నేడు నాలుగో రోజుకు చేరుకున్నాయి. హైదరాబాద్ నగరంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

బుధవారం నాడు నగరంలోని దాదాపు 20 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసిన ఐటీ అధికారులు ప్రముఖ కేఎం కోహినూర్ రియల్ ఎస్టేట్ కంపెనీలలో తనిఖీలు మొదలుపెట్టారు.

రియల్ ఎస్టేట్ సంస్థ డైరెక్టర్ లతోపాటు, సంస్థ కార్యాలయాలపై దాడులు చేస్తున్న ఐటి అధికారులకు ఈ దాడులలో భారీగా నగదు, కీలక డాక్యుమెంట్లు లభించినట్టు సమాచారం. కేఎం కోహినూర్ గ్రూప్ కంపెనీ అహ్మద్ ఖాద్రీ ఇల్లు తో పాటు పలు చోట్ల తనిఖీలు చేసిన ఐటీ అధికారులు భారీ ఎత్తున భూముల క్రయ విక్రయాలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

కొండాపూర్, మాదన్నపేట, మెహదీపట్నం, శాస్త్రిపురం తో పాటు పలు ప్రాంతాలలో సోదాలు కొనసాగుతున్నాయి. అంతేకాదు ఈ సోదాల్లో కేఎం కోహినూర్ పేరుతో బినామీ కంపెనీలు కూడా సృష్టించినట్టు ఐటి అధికారులు గుర్తించారు. బినామీ కంపెనీల పేరుతో రిజిస్టర్ వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించారు. దాదాపు కేఎం కోహినూర్ సంస్థకు చెందిన ఆరు రియల్ ఎస్టేట్ కంపెనీలలో సోదాలు జరిపిన ఐటి అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తుంది.

ఆదాయానికి సంబంధించిన అనేక వివరాలను కూపీ లాగుతున్నారు. అయితే ఎంత మేరకు నగదును స్వాధీనం చేసుకున్నారో అధికారికంగా తెలియాల్సి ఉంది. కింగ్ కోహినూర్, ఆర్ ఆర్ రియల్ ఎస్టేట్, విజ్ రియల్టీలు, విజ్ ప్రాపర్టీస్ తదితర కంపెనీల్లో తనిఖీలు చేస్తున్న ఐటీ అధికారులు ఈ కంపెనీల లో పలువురు రాజకీయ నేతల బినామీలు పెట్టుబడులు పెట్టినట్లుగా గుర్తించారు.

తెలంగాణా అప్పుల్లో నెంబర్ వన్; ఆ లెక్కలు చెప్పాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్!!

కేఎం కోహినూర్ సంస్థలు ప్రభుత్వ ప్రాజెక్టులలో కూడా వెంచర్లు వేసినట్టు గుర్తించిన ఐటీ అధికారులు ఆ కోణంలోనూ ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో మాత్రమే కాకుండా నోయిడా, ఢిల్లీ, కర్ణాటకలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నాలుగురోజులుగా ఐటీ అధికారుల సోదాలతో తెలంగాణలో టెన్షన్ నెలకొంది.

YES9 TV