Latest Posts

ఎవరు పెత్తందార్లు.? ఎవరు పేదవాళ్ళు.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర విచిత్రమైన రాజకీయం నడుస్తోంది. కుల రాజకీయాలకు పెట్టింది పేరు.. అన్నట్లుగా వ్యవహరిస్తున్న పార్టీలు..

ఇతర పార్టీలపై ‘కులం’ పేరుతో ఆరోపణలు చేస్తున్నాయి.! అంతేనా.? అత్యంత ధనికులైన రాజకీయ నాయకులు.. ‘పెత్తందారీ వర్సెస్ పేదలు’ అంటూ వితండవాదాన్ని తెరపైకి తెస్తున్నారు.

‘ఇది పెత్తందార్లకీ పేదవారికీ మధ్య జరుగుతున్న యుద్ధం.. ఈ యుద్ధంలో పేదవారికి అండగా జగనన్న ప్రభుత్వం వుంది. అందరూ ఒక్కసారి ఆలోచన చేయండి.. ఈ యుద్ధంలో మీ మద్దతు ఎవరి వైపు..’ అంటూ వైసీపీ ఓ కార్టూన్ వదిలింది సోషల్ మీడియా వేదికగా.

నిజానికి, ఈ వ్యాఖ్యలు గత కొద్ది రోజులుగా వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే చేస్తున్నారు. ‘వాళ్ళకు మీడియా సంస్థలున్నాయ్.. వాళ్ళకు డబ్బులున్నాయ్.. మీ బిడ్డ అయిన నాకు అవేమీ లేవు..’ అంటున్నారాయన.

సాక్షి మీడియా ఎవరిది.? భారతి సిమెంట్స్ ఎవరివి.? ఇక్కడ పెత్తందార్లు ఎవరు.? పేదవాళ్ళు ఎవరు.? ఎవరితో ఎవరికి యుద్ధం జరగాల్సి వుంది.? 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారమే చూసినా.. దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఆయన.

మరి, పెత్తందార్లకూ.. పేదవాళ్ళకూ మధ్య యుద్ధమంటే.. ధనిక ముఖ్యమంత్రికీ.. సామాన్య ప్రజలకీ మధ్య యుద్ధమనే కదా అర్థం. తన వేలితోనే, తన కంట్లోనే పొడుచుకుంటున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.. అసలు ఇలాంటి సలహాలు ఎవరు ఇస్తున్నారో ఏమో.!

Posted Under AP
YES9 TV