అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఓ అగంతకుడు మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీలో ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
మరికొందరు గాయపడ్డారు. సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో దుండగుడు ఈస్ట్ లాన్సింగ్లోని ప్రధాన క్యాంపస్లోకి చొరబడి కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఆందోళన చెందిన విద్యార్థులు గదుల్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. నిందితుడి అక్కడ నుంచి పరారైనట్లు వర్సిటీ సిబ్బంది తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అమెరికాలోని ప్రముఖ వర్సిటీల్లో మిచిగాన్ యూనివర్సిటీ ఒకటి. ఈస్ట్ లాన్సింగ్ క్యాంపస్లో 50,000 గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు చదువుకుంటున్నారు. కాల్పుల నేపథ్యంలో 48 గంటలపాటు తరగతులను రద్దు చేశారు. ఈస్ట్ లాన్సింగ్కు తూర్పున 80 మైళ్ల దూరంలో ఉన్న మిచిగాన్లోని ఓక్లాండ్ కౌంటీలోని ఆక్స్ఫర్డ్ హైస్కూల్లో నవంబర్ 30, 2021న 15 ఏళ్ల విద్యార్థి కాల్పులకు తెగబడ్డాడు. ఈఘటనలో నలుగురు విద్యార్థులు మృతి చెందగా… మరో ఏడుగురు గాయపడ్డారు. 14 నెలల తర్వాత తాజా ఘటన చోటుచేసుకుంది.
