తుపాను కారణంగా న్యూజిలాండ్ జాతీయ అత్యవసర పరిస్థితి

తుపాను కారణంగా న్యూజిలాండ్ జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించింది. నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించడం న్యూజిలాండ్ చరిత్రలో ఇది మూడోసారి. 2019 క్రైస్ట్‌చర్చ్ ఉగ్రవాద దాడులు మరియు 2020 కోవిడ్ మహమ్మారి సమయంలో అత్యవసర పరిస్థితిని విధించారు. తాజాగా గాబ్రియేల్ తుపాన్ న్యూజిలాండ్ ఉత్తర భాగంపై విరుచుకుపడుతుంది. భారీ వర్షం మరియు బలమైన గాలుల కారణంగా పదివేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అక్కడక్కడ కొండచరియలు విరిగిపడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదలు కారణంగా రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. చాలా వరకు విమాన సర్వీసులను రద్దు చేశారు. వెస్ట్ ఆక్లాండ్‌లో ఒక ఇల్లు కూలిపోవడంతో ఒక అగ్నిమాపక అధికారి తప్పిపోయారని మరియు మరొకరి పరిస్థితి విషమంగా ఉందని న్యూజిలాండ్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ తెలిపింది. ఈ తుపాన్ కారణంగా దేశంలోని చాలా ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. ఉత్తర ఐలాండ్‌లోని జాతీయ రహదారులు, పోర్టులు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలను ఇప్పటికే మూసేశారు. అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. కొన్ని వారాల కిందట ఆక్లాండ్‌, ఉత్తర ఐలాండ్‌ ప్రాంతాలను భారీ తుపాను తాకిన సంగతి తెలిసిందే.

YES9 TV