ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ బ్యూరో ఛీఫ్ ఏబీపై చర్యలకు కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ ఛీఫ్ ఏపీ వెంకటేశ్వరరావుకు చుక్కెదురైంది. ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు కేంద్ర హోంశాఖ అంగీకరించింది. ఈ మేరకు ఏపీ ఛీఫ్ సెక్రటరీకు లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వానికి , ఇంటెలిజెన్స్ మాజీ అధికారికి మధ్య చాలాకాలంగా వివాదం నడుస్తోంది. ఇంటెలిజెన్స్ బ్యూరోగా వ్యవహరించిన సమయంలో అధికార దుర్వినియోగం చేశారనేది ప్రదాన అభియోగం. ఇజ్రాయిల్ దేశం నుంచి నిఘా పరికరాల్ని కొనుగోలు చేసి అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఏపీ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంపై ఆయన గతంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వ కార్యదర్శికి వ్యతిరేకంగా కోర్టులో పిటీషన్ దాఖలు చేయగా..విచారణకు అవసరమైన సమగ్ర సమాచారం లేదని భావించిన హైకోర్టు పిటీషన్ కొట్టివేసింది. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏబీ వెంకటేశ్వరరావుని ఏపీ ప్రభుత్వం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమీషనర్‌గా నియమించింది. ఆ తరువాత మరోసారి సస్పెండ్ చేసింది. తాజాగా ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు, డిస్మిస్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది.

రాష్ట్ర ప్రభుత్వ సిఫారసుల్ని పరిశీలించిన కేంద్ర హోంశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఏబీ వెంకటేశ్వరరావును డిస్మిస్ చేయాలనే సిఫారసును తిరస్కరించింది. కానీ శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు అనుమతిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంక్రిమెంట్లు నిలిపివేసేందుకు అనుమతిచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావును సర్వీసు నుంచి పూర్తిగా తప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించినా..సాధ్యం కాలేదు. యూపీఎస్సీ సలహా మేరకు తదుపరి చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర హోంశాఖ. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఏబీ వెంకటేశ్వరరావు కోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు రిటైర్ అయ్యేవరకూ వచ్చే ఇంక్రిమెంట్లను రద్దు చేయాలని కేంద్ర హోంశా తెలిపింది. గతంలోనే ఆయనను రెండు సార్లు సస్పెండ్ చేసిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర హోంశాఖ అనుమతివ్వడంతో ఇంకేం చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది.

YES9 TV