గుంటూరు జిల్లాలో తాడేపల్లిలో అంధ యువతి హత్య ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. వైసీపీ ముఖ్యమంత్రి తాడేపల్లి నివాసానికి సమీపంలో అంధ యువతి హత్యకు గురైన ఘటన కలచివేసిందన్నారు. కంటి చూపునకు నోచుకోని ఆ యువతిని వేధింపులకు గురి చేసి కిరాతకంగా నరికి చంపిన మృగాడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గంజాయి మత్తులో సదరు వ్యక్తి నేరానికి ఒడిగట్టాడని.. గతంలోనూ పోలీసులపైనా, మహిళలపైన దాడులకు తెగబడ్డాడని పోలీసులు చెబుతున్నారని అన్నారు. ఈ హత్య ఘటనను శాంతిభద్రతల వైఫల్యంగా చూడాలని పేర్కొన్నారు. ‘ముఖ్యమంత్రి ఇంటి పరిసరాల్లో పటిష్టమైన పోలీసు పహారా, నిఘా వ్యవస్థలు పని చేస్తాయి. అయినా తాడేపల్లి ప్రాంతం అసాంఘిక శక్తులకు, గంజాయికీ అడ్డాగా మారింది. అంటే లోపం ఎక్కడ ఉంది..? ఏడాదిన్నర క్రితం ఆ ప్రాంతంలోనే ఓ యువతిపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుల్లో ఒకర్ని ఇప్పటికీ పట్టుకోలేకపోయారంటే వైఫల్యం ఎవరిదీ..? తన నివాసం పరిసరాల్లో పరిస్టితులనే సమీక్షించకుండా మౌనంగా ఉండే పాలకుడు కోటలో ఉన్నా పేటలో ఉన్నా ఒకటే. పోలీసు శాఖకు అవార్డులు వచ్చాయి, దిశా చట్టం చేశామని చెప్పుకోవడమే తప్ప రాష్ట్రంలో ఆడబిడ్డలకు మాత్రం రక్షణ లేకుండాపోయింది.
ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు ఉన్నతాధికారులే పటిష్ట చర్యలు తీసుకోవాలి. అత్యాచారాలు చోటు చేసుకొంటున్నాయి అంటే తల్లి పెంపకంలోనే లోపం ఉంది. ఏదో దొంగతనానికి వచ్చి రేప్ చేశారు అంటూ వ్యాఖ్యానించే మంత్రులు ఉన్న ప్రభుత్వం ఇది. ఆడపడుచులపై అఘాయిత్యాలు సాగుతున్నా.. మహిళా కమిషన్ ఏం చేస్తోంది..? పదవులు ఇచ్చినవారిని మెప్పెంచేందుకు రాజకీయపరమైన ప్రకటనలు, నోటీసులు ఇస్తే మహిళలకు రక్షణ, భరోసా దక్కవని గుర్తించాలి. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైంది. గంజాయికి కేరాఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ను మార్చేశారు. శాంతిభద్రతల వైఫల్యం, ఆడబిడ్డలపై అఘాయిత్యాలపై మహిళా సంఘాలు, మేధావులు, న్యాయ నిపుణులు గళమెత్తాలి..’ అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఏం జరిగింది..? తాడేపల్లిలో గంజాయి మత్తులో 17 ఏళ్ల అంధ యువతిని రాజు అనే యువకుడు గంజాయి మత్తులో దారుణంగా హత్య చేశాడు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నివాసానికి కూత వేటు దూరంలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. యువతి ఇంటికి వెళ్లి అసభ్యంగా రాజు ప్రవర్తించగా.. అతని ప్రవర్తనపై అమ్మ, పెద్దమ్మకి ఆమె చెప్పింది. రాజుని వాళ్లు నిలదీయగా.. తనకు చెల్లి లాంటిదంటూ నమ్మించాడు. వాళ్లు అడిగిన ఐదు నిమిషాల్లోనే యువతి తలపై విచక్షణారహితంగా నరికాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. రాజును పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. చూపు లేని కూతురిని హత్య చేసిన దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
