అదానీ గ్రూప్పై షేర్ల అవకతవకలు, అవినీతి, ఎక్కౌంటింగ్ ఫ్రాడ్ ఆరోపణలతో హిండెన్బర్గ్ సంస్థ వెలువరించిన నివేదిక ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇప్పుడిదే వ్యవహారంపై సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హిండెన్బర్గ్ నివేదికతో ప్రపంచ కుబేరులో జాబితాలో 3వ స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ టాప్ 20 జాబితా నుంచి వైదొలగిపోయారు. అదానీ గ్రూప్లో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులు చాలామంది నష్టపోయారు. ఇన్వెస్టర్లలో ఇది తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో ఓ విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటీషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం దీనిపై విచారించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలకాంశాల్ని ప్రస్తావించింది. భారతీయ పెట్టుబడిదారులకు రక్షణ ఎలా కల్పిస్తున్నారని మార్కెట్ రెగ్యులేటరీ కమిటీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
అదానీ గ్రూప్ స్టాక్స్ సహా స్టాక్ మార్కెట్లో లక్షల కోట్ల సంపద ఆవిరి కావడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. భారత ఇన్వెస్టర్ల డబ్బుల్ని పరిరక్షించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించింది. దీనికి సమాధానంగా అదానీ గ్రూప్ వ్యవహారంపై పనిచేస్తున్నామని సెబీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఈక్విటీ ఇన్వెస్టింగ్ విధానాన్ని పటిష్టం చేసేందుకు ఏం చేయాలనే అంశంపై తగిన సూచనలతో ఫిబ్రవరి 13వ తేదీన జరిగే విచారణకు హాజరుకావాలని సుప్రీంకోర్టు సూచించింది. సుప్రీంకోర్టు సూచనలు లోపాలు ఏంటనేది మీరు మాకు చెప్పాల్సిన పని లేదు. వాటిని సరి చేసేందుకు ఏం చర్యలు చేపట్టవచ్చో మాకు చెప్పండి అని సుప్రీంకోర్టు సెబీకు తెలిపింది. స్టాక్ మార్కెట్ అధిక విలువ కలిగిన ఇన్వెస్టర్లు మాత్రమే పెట్టుబడి పెట్టే ప్రదేశం కాదని..మారుతున్న పన్ను విధానాలతో చాలామంది పెట్టుబడులు పెడతారని సుప్రీంకోర్టు తెలిపింది. మరోవైపు ప్రస్తుత నియంత్రణను ఎలా పటిష్టం చేస్తాని కూడా ఛీఫ్ జస్టిస్ చంద్రచూడ్ సెబీని ప్రశ్నించారు. రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలోని బ్యాంకింగ్, పెట్టుబడులకు చెందిన నిపుణులతో కూడిన విచారణ కమిటీ ఏర్పాటుపై ఆలోచిస్తున్నామని కూడా చెప్పారు.
