కేసీఆర్ కుటుంబం తెలంగాణకు పట్టుకున్న శని, శాపం : కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి

కేసీఆర్ కుటుంబం తెలంగాణకు పట్టుకున్న శని, శాపం అని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి విమర్శించారు. రెండుసార్లు కల్వకుంట్ల కుటుంబాన్ని గెలిపించుకున్నప్పటికీ.. తొమ్మిదేళ్లలో అమరవీరుల ఆంక్షాలు నెరవేరలేదని, ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయారని మండిపడ్డారు. సికింద్రాబాద్‌లోని వారాసిగూడ చౌరస్తాలో ‘ప్రజా గోస-బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా శనివారం స్ట్రీట్ కార్నర్ సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ ఏడాది తెలంగాణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో తర్వాతి ముఖ్యమంత్రి ఎవరో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. ఈ తొమ్మిదేళ్లలో బంగారు తెలంగాణ నిర్మాణం జరగలేదు కానీ.. కేసీఆర్ కుటుంబం మాత్రం బంగారు కుటుంబం అయ్యిందన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తానని చెప్పి మోసం చేసి.. కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇళ్లు ఇచ్చారని, కేసీఆర్ కుటుంబం పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకుంటోందని విమర్శించారు. కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణలో పేద ప్రజలకు ఇండ్లు వచ్చే అవకాశం లేదని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణలో దోపిడి చేసిన డబ్బుతో ఫామ్ హౌస్‌లు, విమానాలు కొంటోందని.. పార్టీలు పెట్టి దేశవ్యాప్తంగా తమ పార్టీలో చేరమని డబ్బులు పంచుతోందని విమర్శించారు. చివరికి తెలంగాణ పేరుతో ఉన్న టీఆర్ఎస్ పార్టీని తీసేసి.. బీఆర్ఎస్‌గా మార్చేశారన్నారు. ‘1200 మంది అమరవీరుల ప్రాణత్యాగం ద్వారా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం.. కల్వకుంట్ల కుటుంబం పాలైంది. తండ్రీకొడుకులకు అబద్ధాలు ఆడటంలో నోబెల్ బహుమతి ఇవ్వాలి. హైదరాబాద్‌లో 80 రూపాయలు ఆదాయం వస్తే అందులో కనీసం 5 రూపాయల కూడా ఖర్చు పెట్టడం లేదు. నగరంలో అభివృద్ధి జరుగుతోందని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. సిటీలో పింఛను కార్డులు, రేషన్ కార్డులు లేవు. ప్రజలకు అది చేస్తాం.. ఇది చేస్తామని ఆశ చూపించి, దారుణంగా మోసం చేస్తున్నారు. కేసీఆర్‌లా ప్రధాని మోదీకి ఫామ్ హౌస్‌లు, వేల కోట్లు లేవు. పేద కుటుంబం నుంచి వచ్చిన మోదీ.. దేశ ప్రధాని అయ్యారని.. కరోనా టైంలో మోదీ తీసుకున్న నిర్ణయాలతో ప్రజలు ఇప్పుడు క్షేమంగా ఉన్నారు..’ అని కిషన్ అన్నారు. కేసీఆర్ వేలాది కోట్లు దోచుకుంటున్నారని, ఖాళీ భూమి కనిపిస్తే కబ్జా చేసేస్తున్నారని మండిపడ్డారు. ఇసుక మాఫియాలో బీఆర్ఎస్, లిక్కర్ మాఫియాలో బీఆర్ఎస్, ల్యాండ్ మాఫియాలో బీఆర్ఎస్ ఏదీ చూసినా అక్కడ గద్దల్లా వచ్చి ప్రజల నోటికాడి కూడును లాగేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు.

YES9 TV