గిరిజనులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్

గిరిజనులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు. భూమిలేని గిరిజన బిడ్డలకు త్వరలో గిరిజన బంధు ప్రారంభిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలులేని గిరిజన కుటుంబాలను ఆదుకుంటామన్నారు. పోడు భూముల సమస్యపై అసెంబ్లీలో మాట్లాడిన కేసీఆర్.. ఈ మేరకు హామీ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గుత్తికోయలు ఇక్కడకు వలస వచ్చి.. అధికారులపై జులుం చేయడం సరికాదన్నారు. భూఆక్రమణను అడ్డుకోబోయిన ఫారెస్ట్ అధికారిని పట్టపగలే చంపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గుత్తికోయలు చాలా ఆటవికంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. పోడు భూముల సమస్య న్యాయమైన డిమాండ్‌ అని అన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో 11 లక్షల పోడు భూముల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ నెలలోనే పోడు భూముల పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు. అయితే ఇక నుంచి అటవీ భూముల్లో నరికివేత ఉండదని గ్రామ సర్పంచ్ సహా గ్రామంలోని అఖిలపక్షాలు అన్నీ సంతకాలు చేయాలని.. ఆ తరువాతే పోడు పట్టాలను పంపిణీ చేస్తామన్నారు. అప్పటివరకు పోడు భూములను సాగుచేసుకునే వారికి పట్టాలను పంపిణీ చేయమని ఆయన స్పష్టం చేశారు.

ఇది ఎన్నికల కోసం చేసే దందా కాదని ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారు. పోడు భూములంటే దురాక్రమణేనని అన్న ముఖ్యమంత్రి.. అడవులన్నీ నరికేయడం సరైంది కాదని అన్నారు. ప్రతిసారీ దీనిపై రాజకీయం చేయడం అలవాటైపోయిందని ముఖ్యమంత్రి అన్నారు. ‘గత ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఈ విషయం పెద్ద సమస్యగా మారింది. కొన్ని పార్టీలకు ఇదో ఆట వస్తువుగా మారింది. కొందరిని జమ చేసుకుని కలెక్టరేట్‌ల వద్ద ధర్నాలు చేయడం అలవాటుగా మారింది. గిరిజనులను కాపాడటంలో ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది. వారి హక్కులకు ఎలాంటి భంగం కలిగించదు. బ్రెజిల్, చైనా తర్వాత చాలా కష్టపడి తెలంగాణలో అటవీ విస్తీర్ణం పెంచాం. కనుమరుగైన అటవీ సంపదను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ కృషి ఫలితంగానే మంచి రిజల్స్ట్‌ కూడా వచ్చాయి. రాష్ట్రంలో 7.8 అటవీ విస్తీర్ణం పెరిగిందని అంతర్జాతీయ సంస్థలు కితాబు ఇచ్చాయి..’ అని సీఎం కేసీఆర్ అన్నారు. అటవీ అధికారుల దురుసు ప్రవర్తన కూడా ఉందని ముఖ్యమంత్రి అంగీకరించారు. దాన్ని కూడా సరిచేస్తున్నామని అసెంబ్లీ చెప్పారు. మొత్తం ఎన్ని ఎకరాల్లో పోడు భూములు ఉన్నాయో తేలాల్సి ఉందని.. పటిష్టమైన లెక్కల చూసి పంపిణీ చేద్దామని అన్నారు. ఇకపై గజం భూమిని కూడా ఆక్రమణ కాకుండా చేద్దామని అన్నారు.

YES9 TV