టర్కీ, సిరియాల్లో 12 వేలకు చేరిన మృతులు.. 8 వేల మందిని రక్షించిన సహాయ బృందాలు!

టర్కీ, సిరియా దేశాల్లో మృత్యుఘోష కొనసాగుతోంది. భారీ భూకంపం దాటికి రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది. భవనాల శిథిలాల నుంచి గంటగంటకూ వందల శవాలు బయటపడుతున్నాయి. పలువురు రాళ్లు, రప్పల మధ్య చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. రెండు దేశాల్లో భారీ భూకంపం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. భూకంపం ధాటికి టర్కీ, సిరియాల్లో మృతుల సంఖ్య దాదాపుగా 12 వేలకు చేరింది. గత దశాబ్ద కాలంలో భూకంపం దాటికి ఇంత భారీగా మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. ఒక్క టర్కీలోనే 9వేలకు పైగా మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ ప్రకటించారు. మరోవైపు సిరియాలో 2,600 మంది భారీ భూకంపం దాటికి బలైపోయారు. మొత్తంగా ఇప్పటివరకు 11,600 మంది మృతి చెందారు.

ఇందులో చిన్న చిన్న పిల్లలు కూడా ఉండడం అందరి హృదయాలను కలిచివేస్తోంది. ఇక టర్కీ, సిరియా దేశాల్లో మృతుల సంఖ్య 20 వేలు దాటే అవకాశం ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. దాదాపు 20కి పైగా దేశాల నుంచి వెళ్లిన సహాయక బృందాలు టర్కీ అత్యవసర బృందాలతో కలిసి.. విరామం లేకుండా సహాయక చర్యల్ని కొనసాగిస్తున్నాయి. భూకంప ప్రభావిత జోన్‌లో దాదాపు 60 వేల మందికి పైగా సిబ్బంది సహాయక చర్యలు అందిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాల కోసం పోరాడుతున్న పలువురు చిన్నారుల్ని సహాయక బృందాలు బయటకు తీసి ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. టర్కీలో 37011 మంది, సిరియాలో 2300 మంది క్షతగాత్రులయ్యారు. టర్కీలో భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని మారుమూల ప్రాంతాల్లో 10 మంది భారతీయులు చిక్కుకుపోగా.. వారందరూ సురక్షితంగా ఉన్నారు. అయితే ఓ వ్యక్తి జాడ మాత్రం తెలియడం లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వ్యాపార నిమిత్తం టర్కీకు వెళ్లిన ఓ బెంగళూరు వ్యక్తి ఆచూకీ లభించడం లేదని భారత విదేశాంగ శాఖ (పశ్చిమ) కార్యదర్శి సంజయ్‌ వర్మ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

YES9 TV