దోచుకోవడంలో అనకొండ.. రుషికొండకు బోడిగుండు: చంద్రబాబు నాయుడు

సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చట్టాన్ని గౌరవిస్తామని అందరం ప్రమాణ స్వీకారం చేస్తామని.. కానీ దానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి జగన్ పనిచేస్తున్నారని విమర్శించారు. లేని అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారని.. విధ్వంసానికి దిగితే కోర్టులు, ప్రజలు, మేధావులు కానీ దాన్ని కరెక్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. గురువారం ఏపీ రాజధాని అంశంపై మీడియా ఆయన మాట్లాడారు. ‘పదేళ్లపాటు హైదరాబాద్ కామన్ కేపిటల్‍గా ఉంటుందని విభజన చట్టంలో స్పష్టం చేశారు. పదేళ్ల తర్వాత ఏపీకి కొత్త కేపిటల్ వస్తుందని చెప్పారు. నిన్న సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ వేసింది. ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినట్లు కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది. విభజన తర్వాత ఆర్నెళ్లలోగా ఒక కమిటీని వేశాం. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చాక ఏపీ ప్రభుత్వానికి పంపించాం.

ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది. చట్టప్రకారం అమరావతిలో అన్నీ పూర్తి చేయాలి. రాజధాని అమరావతి ఎంపిక రహస్యంగా జరగలేదు. రాజధానిగా అమరావతిని మెజారిటీ ప్రజలు ఆమోదించారు. ఎంతో భక్తితో పూజలు చేసి ప్రధాని మోదీ యమునా జలం, పార్లమెంట్ మట్టి తీసుకొచ్చారు. మీ వెంట పార్లమెంట్ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఫారెస్ట్ ల్యాండ్ కూడా వాడుకోవచ్చని యాక్ట్‌లో పెట్టి అమరావతిని నిర్మించాం. అమరావతిని మార్చబోమని మాట ఇచ్చారు. అమరావతిని టీడీపీ కంటే బాగా అభివృద్ధి చేస్తామని చెప్పారా..? లేదా..? ఆ రోజు ఓట్ల కోసం చెప్పి.. ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు గెలిచాక చట్టానికి ఎన్ని తూట్లు పొడవాలో అన్ని పొడిచారు. చట్టాలు చేసే హక్కు శాసనసభకు లేదా అంటూ వక్రీకరించి మాట్లాడారు. కౌన్సిల్ ఛైర్మన్‌ను మతం, కులం పేరుతో బూతులు తిట్టారు. కౌన్సిల్‍ను రద్దు చేయడానికి అసెంబ్లీలో బిల్లు పెట్టారు. మళ్లీ కొన్నాళ్లకు కౌన్సిల్ రద్దును మర్చిపోయారు..’ అని చంద్రబాబు నాయుడు విమర్శించారు.

Posted Under AP
YES9 TV