టర్కీ-సిరియా భూకంపం మరణాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. భూకంపం విధ్వంసం ధాటికి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ భారీ ప్రళయం నుంచి ఓ పసికందు ప్రాణాలతో బయటపడింది. సిరియాలోని జిందాయ్రిస్ అనే పట్టణంలో భూకంపం సమయంలోనే ఓ మహిళ ప్రసవించింది. శిథిలాల కింద అందరూ ఇరుక్కుపోయారు. రెస్క్యూ టీమ్ శిథిలాలను తొలగించగా.. ఆ పసికందు క్షేమంగా ప్రాణాలతో ఉండడం విశేషం. అయితే దురదృష్టవశాత్తూ ఆ చిన్నారి తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో శిథిలాల నుంచి ఒక వ్యక్తి మురికి నవజాత శిశువును మోస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆఫ్రిన్లోని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. భవనం కూలిన విషయం తెలియడంతో బంధువులు ఘటనా స్థలానికి వచ్చారని చిన్నారి మేనమామ ఖలీల్ అల్ సువైదీ చెప్పారు.
శిథిలాలను తొలగించే సమయంలో చిన్న పాప ఏడుపు వినిపించిందన్నారు. మొత్తం రాళ్లను తొలగించగా.. బొడ్డు తాడుతో ఉన్న నవజాత శిశువు కనిపించిందని తెలిపారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లామన్నారు. ఈ ప్రమాదంలో చిన్నారి మినహా మిగిలిన కుటుంబ సభ్యులు అంతా మృత్యువాతపడ్డారు. టర్కీ భూకంపం ఘటనలో మృతుల సంఖ్య అంతకుఅంత పెరుగుతోంది. ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు 8 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య 10 వేల ఉండవచ్చని అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం అంచనా వేసింది. అదేవిధంగా ఇప్పటికే 50 వేలమందిపైగా గాయపడ్డారు. ఈ విపత్తలో టర్కీలో అత్యధికంగా 5,894 మంది మరణించగా. సిరియాలో 1900 మంది మృత్యువాత పడ్డారు. పెద్ద పెద్ద భవనాల కాంక్రీట్ స్లాబులు అమాంతం కూలిపోవడంతో వాటి కింద వేలాదిమంది చిక్కుకుపోయారు. ఆ కాంక్రీట్ స్లాబుల్ని తొలగించే పరికరాలు టర్కీ, సిరియా దేశాల్లో అందుబాటులో లేకపోవడంతో మృతుల సంఖ్య మరింతగా పెరుగుతోంది.
