ఇండియా, ఆస్ట్రేలియా సిరీస్‌లో ఈ రికార్డులు బ్రేకవుతాయా?

ఇండియా, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గురువారం (ఫిబ్రవరి 9) నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ 16వ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కొన్ని రికార్డులు బ్రేకయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాలుగు టెస్టుల సిరీస్ కావడంతో విరాట్ కోహ్లి, పుజారాలాంటి ప్లేయర్స్ అరుదైన రికార్డులను అందుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏ ప్లేయర్ ఏ రికార్డుకు చేరువలో ఉన్నాడో ఒకసారి చూద్దాం. విరాట్ కోహ్లి టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి 25 వేల అంతర్జాతీయ పరుగులకు దగ్గరలో ఉన్నాడు. ఈ అరుదైన రికార్డుకు కేవలం 64 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ రన్స్ చేస్తే ఈ ఘనత అందుకున్న ఓవరాల్ గా ఆరో ప్లేయర్, రెండో ఇండియన్ ప్లేయర్ గా నిలుస్తాడు. ఇక స్వదేశంలో టెస్టుల్లో 4 వేల పరుగుల మైలురాయికి 153 రన్స్ దూరంలో ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ విరాట్ 36 ఇన్నింగ్స్ లో 1682 రన్స్ చేశాడు. సచిన్ (3262), పాంటింగ్ (2555), లక్ష్మణ్ (2434), ద్రవిడ్ (2143), మైకేల్ క్లార్క్ (2049), పుజారా (1893) తర్వాత ఏడో స్థానంలో ఉన్నాడు.

చెతేశ్వర్ పుజారా ఇక ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇండియన్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా 2000 పరుగుల మైలురాయికి 107 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇప్పటి వరకూ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 20 మ్యాచ్ లు ఆడిన పుజారా 1893 రన్స్ చేశాడు. సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్ తర్వాత 2000 పరుగుల మైలురాయి అందుకున్న నాలుగో ఇండియన్ ప్లేయర్ గా పుజారా నిలుస్తాడు. రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో 450 వికెట్ల మైలురాయికి అశ్విన్ కేవలం వికెట్ దూరంలో ఉన్నాడు. టెస్ట్ క్రికెట్ లో అత్యంత వేగంగా ఈ మైలురాయి అందుకున్న బౌలర్ గా అశ్విన్ నిలుస్తాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 111 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్ గా అనిల్ కుంబ్లే పేరిట ఉన్న రికార్డుపై కూడా కన్నేశాడు. అశ్విన్ ఇప్పటి వరకూ 89 వికెట్లు తీసుకున్నాడు. రవీంద్ర జడేజా చాలా రోజుల తర్వాత మళ్లీ ఇండియన్ టీమ్ లోకి వచ్చిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో 250 వికెట్లకు చేరువలో ఉన్నాడు. ఇప్పటి వరకూ జడేజా 60 టెస్టుల్లో 242 వికెట్లు తీసుకున్నాడు. ఈ నాలుగు టెస్టుల సిరీస్ లో జడేజా ఈ మైలురాయి అందుకునే అవకాశం ఉంది. ఈ ఘనత సాధించిన 8వ ఇండియన్ బౌలర్ గా నిలుస్తాడు.

YES9 TV