Latest Posts

మాజీ ముఖ్యమంత్రి సంచలన ప్రకటన

ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. తాను రిటైర్మెంట్ అయినా రాజకీయాల్లో కొనసాగుతానని అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 224 సీట్లు రాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం మే 24, 2023తో ముగుస్తుంది. దీనికి ముందు 2018లో రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. మొదట్లో కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హెచ్‌డీ కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత కూటమిలో విభేదాలు రావడంతో ప్రభుత్వం కుప్పకూలిపోగా.. బీజేపీ అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవ్వడంతో అన్ని పార్టీలు జోరు పెంచాయి.

పార్టీల నేతలు వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బీదర్‌లో జరిగిన ర్యాలీలో సిద్ధరామయ్య ప్రసంగించారు. ర్యాలీలో మాజీ సీఎం ఎమోషనల్ కార్డ్ ప్లే చేస్తూ.. ఇదే తనకు చివరి ఎన్నికలు అని అన్నారు. ఎన్నికల తర్వాత కూడా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటానని చెప్పారు. ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తరహాలోనే ఆయన సంచలన ప్రకటన చేయడం విశేషం. ఈ సందర్భంగా సిద్ధరామయ్య తన 2013-2018 పదవీకాలాన్ని ప్రస్తావిస్తూ.. ప్రజల ఆశీర్వాదంతో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా అవకాశం లభించిందని అన్నారు. దేవరాజ్ ఉర్స్ తర్వాత.. ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసిన రెండవ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. వెంటవెంటనే ముఖ్యమంత్రులను మార్చిన చరిత్ర కర్ణాటకకు ఉంది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, సిద్ధరామయ్య మధ్య ప్రస్తుతం మాటల యుద్ధం నడుస్తోంది. గత బడ్జెట్‌లో ప్రకటించిన వాటిలో కేవలం 10 శాతం మాత్రమే అమలు చేశారని సిద్ధరామయ్య ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రం అప్పులు రూ.3 కోట్లు దాటేశారని అన్నారు. ఈ వ్యాఖ్యలకు సీఎం బసవరాజ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కర్ణాటక చరిత్రలో ఐదేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న తన పాలనలో అత్యధిక రుణాలు తీసుకున్న ఘనత సిద్ధరామయ్యకే దక్కుతుందని సెటైర్లు వేశారు.

YES9 TV