రాష్ట్రంలో కానిస్టేబుల్ నియామకాల పరీక్ష ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేయండి

ఏపీ ప్రభుత్వం పెద్దఎత్తున పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్ని చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ కానిస్టేబుల్ నియామకాల కోసం ప్రిలిమినరీ రాత పరీక్షల్ని నిర్వహించింది. కాస్సేపటి క్రితం వెల్లడైన ఈ పరీక్షల ఫలితాలు slprb.ap.gov.in.లో చెక్ చేసుకోవచ్చు. ఏపీ రాష్ట్ర స్థాయి పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులు కానిస్టేబుల్ ఫలితాల్ని వెల్లడించారు. అధికారిక వెబ్‌సైట్ slprb.ap.gov.in.లో ఫలితాల్ని తమ రిజిస్ట్రేషన్ నెంబర్, ప్రిలిమినరీ టెస్ట్ హాల్ టికెట్ ద్వారా తెలుసుకోవచ్చు. గత నెల 22వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 35 ప్రాంతాల్లో 997 కేంద్రాల్లో ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ పరీక్షల్ని నిర్వహించింది.

6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షలో మొత్తం 4,59, 182 మంది పరీక్షలు రాయగా, 95,208 మంది అభ్యర్ధులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 200 మార్కుల కోసం నిర్వహించిన ఈ రాత పరీక్షలో ఉత్తీర్ణతకు ఓసీ అభ్యర్ధులు 40 శాతం, బీసీ అభ్యర్ధులు 35 శాతం ఎస్సీ-ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్ధులు 30 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష ఆన్సర్ కీ కూడా విడుదలైంది. కీ ప్రకారం 2,261 అభ్యంతరాలు నమోదయ్యాయి. ఈ అభ్యంతరాల్ని పరిగణలో తీసుకుని..మూడు ప్రశ్నల సమాధానాల్ని మార్చారు. ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులకు రెండవ దశ అంటే తుది దశలో ఫిజికల్, మెడికల్ పరీక్షలుంటాయి. ఇవి ఫిబ్రవరి 13 నుంచి ప్రారంభం కానున్నాయి. దరఖాస్తు కోసం ఫిబ్రవరి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ గడువుంటుంది. ఫిజికల్ పరీక్షలకు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.

Posted Under AP
YES9 TV