టీడీపీ నేత నారా లోకేష్పై మంత్రి రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోకేష్ అడుగుపెడితే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని అన్నారు. చంద్రబాబు సైకో అయితే.. కొడుకు లోకేష్ ఐరన్ లెగ్ అని ఎద్దేవా చేశారు. లోకేష్ అడుగుపెట్టగానే పుష్కరాల్లో 29 మంది చనిపోయారని గుర్తు చేశారు. అంతేకాదు ఎమ్మెల్సీగా అడుగుపెట్టగానే చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో నోటీసులు వచ్చాయన్నారు. లోకేష్ పాదయాత్ర పోస్టర్ రిలీజ్ చేస్తే.. కందుకూరులో 8 మంది చనిపోయారని, లోకేష్ పాదయాత్ర చేపట్టిన తొలిరోజు తారకరత్న అస్వస్థతకు గురయ్యారని అన్నారు. విశాఖపట్నంలో మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. ‘తారకరత్న అస్వస్థతకు గురైతే చంద్రబాబు, లోకేష్ పట్టించుకోలేదు. తారకరత్న తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. సీఎం వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత లోకేష్కు లేదు. పాదయాత్ర తొలిరోజు ప్రసంగంలో లోకేష్ పాండిత్యాన్ని చూశాం. జీవోను జియో అని, పాలనను పానల అని, ప్రశాంతతను ప్రశాంత్ అత్త అని మాట్లాడాడు. తెలుగు సరిగ్గా మాట్లాడటం రాని వ్యక్తి నాయకుడు ఎలా అవుతాడు.
అతను లోకేష్ కాదు.. పులకేష్..’ అని రోజా సెటైర్లు వేశారు. తన తండ్రి ఆశయాల సాధన కోసం, రాష్ట్ర ప్రజల కోసం సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారని అన్నారు మంత్రి రోజా. ప్రజల కష్టాలను కళ్లారా చూసి వారికి భరోసా ఇచ్చారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తరువాత 98 శాతం హామీలు పూర్తిచేశారని అన్నారు. లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి, ప్రజలు ఏం చేశాడు..? అని ప్రశ్నించారు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను నమ్మించవచ్చనే భ్రమలో చంద్రబాబు, లోకేష్ ఉన్నారని.. జనాలు పిచ్చవారు అనుకుంటున్నారా..? అని ఫైర్ అయ్యారు. అధికారం కోల్పోయి నిరుద్యోగులైన చంద్రబాబు, లోకేష్ రోడ్ల మీదకు వచ్చారని.. అబద్ధాలతో, అసత్య ఆరోపణలతో కాలక్షేపం చేస్తున్నారని రోజా అన్నారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడే చంద్రబాబు, నారా లోకేష్కు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. సీఎం జగన్ పాలన మహిళలకు భద్రత పెరిగిందన్నారు.
