జగన్‌ బుల్లెట్ లేని గన్‌.. సౌండ్ ఎక్కువ పని తక్కువ: నారా లోకేష్ సెటైర్లు

తాను మంత్రిగా ఎంతో చేశానని.. అదే హక్కుతో పాదయాత్ర నిర్వహిస్తున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మంత్రులుగా ఉన్న ఇప్పుడున్న వాళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. యువగళం పేరు ప్రకటించగానే వైసీపీ నేతల ప్యాంట్లు తడిశాయన్నారు. పది మంది మంత్రులు తనపై విమర్శల దాడి చేశారని అన్నారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర శుక్రవారం కుప్పంలో ఆరంభమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ‘ఏ హక్కుతో పాదయాత్ర చేస్తారని నన్ను ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. 25 వేల కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయించిన ఘనత నాది. 25 లక్షల వీధి దీపాలు వేయించాను. ఐటీలో నలభై వేల మందికి ఉద్యోగాలు కల్పించిన మంత్రిగా వస్తున్నాను. ఎలక్ట్రానిక్స్ రంగంలో 40 వేల ఉద్యోగాలు కల్పించింది నేనే. మూడుశాఖల మంత్రిగా చేసిన అభివృద్ధి హక్కుతో పాదయాత్ర చేస్తున్నాను. వైసీపీ పాలనలో రాష్ట్రానికి ఏం పీకారని ప్రశ్నిస్తున్నాను. వైసీపీ మంత్రుల్లా వీధుల్లో డ్యాన్సులు వేస్తే పరిశ్రమలు రావు. కేసినోలు నడిపితే పరిశ్రమలు రావు మంత్రి గారూ!

ఒక్క ఛాన్స్ జగన్ రాష్ట్రాన్ని 67 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాడు..’ అని నారా లోకేష్ విమర్శించారు. ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు, మహిళలు అంతా ఈ ప్రభుత్వం బాధితులేనని అన్నారు. రాష్ట్రం పరిస్థితిపై యువత ఆందోళనలు చూశాక వచ్చిన ఆలోచనే యువగళమన్నారు. ప్రభుత్వ అరాచకాలు, అవినీతిపై పోరాడే యువతకు యువగళం ఓ వేదిక కానుందన్నారు. జగన్ మోహన్ రెడ్డి అంటే జాదూ రెడ్డి గుర్తొస్తాడని.. మైసూర్ బోండాలో మైసూరు ఉండదు.. జాదూరెడ్డి జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాలు ఉండవన్నారు. గ్రూప్ 1, 2 నోటిఫికేషన్లలో 36 ఉద్యోగాల భర్తీకి ప్రకటన ఇవ్వడానికి సిగ్గులేదా జాదూరెడ్డి..? అని ప్రశ్నించారు. ‘జె ట్యాక్స్ కోసం వేధింపులు తీవ్రం కావడంతో రిలయన్స్‌, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ , హోలీ టెక్‌, మెగా సీడ్ పార్క్‌, అమరరాజా కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోయాయి. చిత్తూరు జిల్లాలో వేలాది మందికి ఉపాధి కల్పించిన అమర్ రాజా పరిశ్రమని పక్క రాష్ట్రాలకు తరిమేశారు. ప్రజాధనం తీసుకునే జీతగాడు సజ్జల అమరరాజా పోలేదు, మేమే పంపేశామని గొప్పగా చెప్పుకోవడం మన దౌర్భాగ్యం. అమరరాజా వెళ్లిపోవడంతో 10 వేలు ఉద్యోగాలు మన యువత కోల్పోయారు. పరిశ్రమలన్నీ బై బై ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి తరలిపోతున్నాయి.

Posted Under AP
YES9 TV