బాలకృష్ణకు తృటిలో తప్పిన ప్రమాదం.. ఒక్కసారిగా వాహనం కదలడంతో..

హిందూపురం పర్యటనలో సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. రిపబ్లిక్ డే సందర్భంగా హిందూపురానికి వచ్చిన ఆయన.. ప్రజలతో మమేకం అయ్యేందుకు రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు భారీగా కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. వాహనంపై నిలుచున్న బాలయ్య.. కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా వాహనం ముందుకు కదిలింది. దీంతో వెనక్కి తుళ్లి వెనక్కిపడగా.. వాహనం ఉన్న నాయకులు పట్టుకున్నారు. దీంతో ప్రమాదం తప్పింది. దీంతో ఏం జరిగిందోనని అక్కడ ఉన్న వారు అయోమయానికి గురయ్యారు. వెంటనే నిలబడి మళ్లీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్‌కు పరిపాలన చేతకావడం లేదన్నారు.

నవరత్నాల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారని.. ఉచిత పథకాల మోజులో పడి మోసపోవద్దన్నారు. మూడు రాజధానుల పేరుతో మూడేళ్లు గడిపారని మండిపడ్డారు. రాష్ట్రంలో అధ్వాన్న పరిస్థితులు ఏర్పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ అసలు మనిషే కాదంటూ ఓ రేంజ్‌లో కామెంట్స్ చేశారు. చీము నెత్తురు, సిగ్గు శరం ఏమీ లేవన్నారు. ‘రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు రావు. దీంతో యువత గంజాయికి అలవాటు పడుతున్నారు. గంజాయి స్మగ్లింగ్‌లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్‌గా ఉంది. పన్నులపై పన్నులు వేస్తూ ప్రజలపై భారం మోపుతున్నారు. చివరికి, చెత్త పన్ను కూడా వేసిన చెత్త ప్రభుత్వం ఇది. ముఖ్యమంత్రి జగన్ బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరు. ల్యాండ్, శాండ్, వైన్ అన్నింటినీ అధికార పార్టీ నాయకులు దోచుకున్నారు..’ అని బాలయ్య ఆరోపించారు. హిందూపురం పర్యటన అనంతరం చిత్తూరు జిల్లా కుప్పానికి వెళ్లనున్నారు బాలయ్య. శుక్రవారం తన అల్లుడు, టీడీపీ నేత నారా లోకేష్ మొదలు పెట్టనున్న యువగళం పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్నారు. తొలిరోజు నారా లోకేష్‌తో కలిసి అడుగులో అడుగు వేయనున్నారు బాలయ్య.

Posted Under AP
YES9 TV