వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. ఈసారి పోలీసులు అనుమతిచ్చినా ఇవ్వకపోయినా పాదయాత్ర ప్రారంభమై తీరుతుందన్నారు షర్మిల. మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల పలు ఇతర అంశాలపై స్పందించారు. తెలంగాణలో ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎంత ఒత్తిడి తెచ్చినా ఇప్పటికే 3500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశానన్నారు వైఎస్ షర్మిల. ఇప్పుడు తిరిగి జనవరి 28 నుంచి ప్రారంభిస్తానన్నారు. ఎక్కడ తన యాత్రను ఆపారో అక్కడ్నించే మొదలు పెడతానన్నారు. బీజేపీ ఓ మతతత్వ పార్టీ అని తమకు ఆ పార్టీతో సంబంధం లేదని తెలిపారు.
కేసీఆర్ తనకు భయపడే ఖమ్మంలో సభ నిర్వహించాలని..తాను రానున్న ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని చెప్పారు. కేసీఆర్కు రాజ్యాంగంపై, మహిళలపై గౌరవం లేదని విమర్శించారు. ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను త్వరగా పూర్తి చేసి..దోషుల్ని శిక్షించాలని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల సీబీఐను కోరారు. విచారణ జాప్యానికి ఏపీ ప్రభుత్వం ప్రమేయముందా అనే ప్రశ్నకు ఉండకూడదంటూ లాజికల్ సమాధానమిచ్చారు. వైఎస్ వివేకానందరెడ్డి గొప్ప నాయకుడని..అత్యంత దారుణంగా హత్య చేశారని ఆవేదన చెందారు. కేసు దర్యాప్తు ఆలస్యం చేస్తే సీబీఐపై ప్రజలకు నమ్మకం పోతుందని వైఎస్ షర్మిల విమర్శించారు. ఇప్పటికైనా ఈ కేసును త్వరగా తేల్చాలన్నారు.
