ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1 వర్సెస్ ప్రతిపక్షాల వ్యవహారంపై హైకోర్టులో వాదనలు వాడివేడిగా సాగాయి. జీవోపై స్టే కొనసాగించడాన్ని నిరాకరించిన ఏపీ హైకోర్టు..తీర్పును మాత్రం రిజర్వ్ చేయడంతో అందరిలో ఉత్కంఠ మొదలైంది. ఏపీలో కందుకూరు, గుంటూరులో టీడీపీ తలపెట్టిన బహిరంగ సభల్లో తొక్కిసలాట చోటుచేసుకుని 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీల సభల్లో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకోవడంతో ఏపీ ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. జీవో నెంబర్ 1 తీసుకొచ్చింది. ఈ జీవో ప్రకారం మున్సిపల్, జాతీయ, పంచాయితీ రోడ్లపై బహిరంగ సభలు నిర్వహించకూడదు. ఈ జీవోను సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్పై హైకోర్టు వెకేషన్ బెంచ్ అత్యవసరంగా భావించి విచారణ చేపట్టడమే కాకుండా..జీవో నెంబర్ 1పై స్టే విధించింది. తదుపరి విచారణను ఈ నెల 24న చేపడతామని చెప్పింది. ఆ తరువాత ఇదే అంశంపై సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం విచారణ చేపట్టి..వెకేషన్ బెంచ్ తీరును తప్పుబట్టింది. డీఫాక్టో ప్రధాన న్యాయమూర్తిలా వ్యవహరించారని..వెకేషన్ కోర్టులో ఏం జరిగిందే అంతా తెలుసని..మూలాల్లోకి వెళ్లి ఈ వ్యవహారాన్ని తేలుస్తామని తీవ్రంగానే స్పష్టం చేశారు.
సెలవుల్లో ఏ విధమైన అత్యవసర కేసులు విచారించాలో ప్రధాన న్యాయమూర్తి పరిపాలనాపరంగా నిర్దిష్ట ఆదేశాలు జారీ చేసినప్పటికీ..అందుకు విరుద్ధంగా జస్టిస్ బట్టు దేవానంద్ నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ వ్యవహరించడాన్ని సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా తప్పుబట్టారు. ప్రతి వెకేషన్ జడ్జి ప్రధాన న్యాయమూర్తిలా వ్యవహరిస్తే.. వ్యవస్థ ఏమౌతుందోని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తేలిగ్గా తీసుకునే అంశం కానేకాదన్నారు. ఇదే అంశంపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర, బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ, కాంగ్రెస్ నేత గిడుగు రుద్రరాజులు దాఖలు చేసిన పిటీషన్లపై ఏపీ హైకోర్టు వాదనలు విన్నది. ఏపీ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదన విన్పించారు. రోడ్ షోలు, ర్యాలీలపై ప్రభుత్వం ఏ విధమైన నిషేధం విధించలేదని..నడి రోడ్డుపై భారీగా జనాన్ని సమీకరించవద్దని మాత్రమే చెప్పామని..ప్రజా రక్షణకు సంబంధించి ప్రభుత్వానికి పూర్తి అధికారముందని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు సభల్లో 11 మంది మరణించడంతోనే ప్రభుత్వం జీవో తీసుకొచ్చిందని చెప్పారు.
