టాప్ ఫామ్ లో ఉన్న టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్.. మరో రికార్డును తన పేరిట రాసుకున్నాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో ఇప్పటికే అతడు విరాట్ కోహ్లి రికార్డును బ్రేక్ చేశాడు. ఇండియా తరఫున మూడు వన్డేల సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లి రికార్డును అధిగమించాడు. శ్రీలంకతో సిరీస్ లో కోహ్లి 283 రన్స్ చేయగా.. ఇప్పుడు గిల్ దానిని బ్రేక్ చేశాడు. మొత్తంగా మూడు వన్డేల సిరీస్ లో గిల్ 360 రన్స్ చేయడం విశేషం. ఈ క్రమంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం పేరిట ఉన్న వరల్డ్ రికార్డును అతడు సమం చేశాడు. 2016లో వెస్టిండీస్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో బాబర్ 360 రన్స్ చేశాడు.
ఇప్పుడా రికార్డును గిల్ సమం చేయడం విశేషం. న్యూజిలాండ్ తో తొలి వన్డేలో గిల్ డబుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. తొలి వన్డేలో 208 రన్స్ చేయగా.. రెండో వన్డేలో 40 పరుగులు, మూడో వన్డేలో 112 రన్స్ చేశాడు. మూడో వన్డేలో రోహిత్ తో కలిసి తొలి వికెట్ కు గిల్ 212 రన్స్ జోడించాడు. కివీస్ పై ఇండియాకు ఇదే అత్యధిక తొలి వికెట్ భాగస్వామ్యం. 2009లో గంభీర్, సెహ్వాగ్ నమోదు చేసిన 201 రన్స్ పార్ట్నర్షిప్ ను వీళ్లు బ్రేక్ చేశారు. గిల్ కేవలం 78 బంతుల్లోనే 13 ఫోర్లు, 5 సిక్స్ లతో 112 రన్స్ చేశాడు. ఈ సిరీస్ లో 180 స్ట్రైక్ రేట్, 128 సగటుతో గిల్ పరుగులు సాధించాడు. ఇక ఓవరాల్ గా అని వన్డే క్రికెట్ రికార్డులు కూడా అద్భుతంగా ఉన్నాయి. గిల్ ఇప్పటి వరకూ 21 వన్డేల్లో 73.76 సగటుతో 1254 రన్స్ చేశాడు. 4 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి.
