అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లాస్ ఏంజెల్స్ సమీపంలోని మాంటేరీ పార్క్లో శనివారం (జనవరి 21) రాత్రి 10 గంటల సమయంలో ఓ వ్యక్తి మెషీన్ గన్తో విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 15 మందికి పైగా చనిపోగా.. చాలా మంది గాయపడినట్లు సమాచారం తెలుస్తోంది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషయంగా ఉందట. ఈ దారుణ ఘటన చైనీస్ లూనార్ న్యూ ఇయర్ ఫెస్టివల్ సందర్భంగా జరిగింది. లా ఎన్ఫోర్స్మెంట్ మూలాల ప్రకారం… లాస్ ఏంజెల్స్కు మాంటేరీ పార్క్ దాదాపుగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గార్వే అవెన్యూలో ఉన్న మాంటేరీ పార్క్లో శనివారం చైనీయుల లూనార్ న్యూఇయర్ ఫెస్టివల్ వేడుక జరుగుతోంది. ఈ ఫెస్టివల్ కోసం అక్కడకు వేల మంది వచ్చారు. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ఓ వ్యక్తి భారీ మెషీన్ గన్తో అక్కడకు వచ్చి కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 15 మందికి పైగా చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
గార్వే అవెన్యూలో కాల్పులు జరిగిన వీధికి ఎదురుగా సీఫుడ్ బార్బెక్యూ రెస్టారెంట్ ఓనర్ సియాంగ్ వాన్ చాయి మాట్లాడుతూ… రాత్రి ముగ్గురు వ్యక్తులు ప్రాణభయంతో రెస్టారెంట్లోకి వచ్చి తలుపులు వేసేశారన్నాడు. బయట ఓ వ్యక్తి ఆటోమేటిక్ గన్తో కాల్పులు జరుపుతున్నాడని వారు చెప్పినట్లు అతడు వెల్లడించాడు. ఆ వ్యక్తి వద్ద భారీగా మందుగుండు (అనేక రౌండ్ల మందుగుండు సామగ్రి) ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొన్నారు. డ్యాన్సింగ్ క్లబ్ లక్ష్యంగా దాడి చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అతిపెద్ద చంద్ర నూతన సంవత్సర కార్యక్రమాలలో ఇది (చైనీస్ లూనార్ న్యూ ఇయర్ వేడుక) ఒకటి. రెండు రోజుల పాటు ఈ పండుగ జరుగుతుంది. అంతకుముందు రెండు రోజులు ప్రజలు ఆభరణాలు షాపింగ్ చేస్తూ.. చైనీస్ ఫుడ్ ఆస్వాదించారు. నూతన సంవత్సర పండుగ వేళలు ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటాయి. కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు అక్కడినుంచి పారిపోయాడు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు ఇంకా గుర్తించలేదు. ఈ హింసాకాండతో లాస్ ఏంజెల్స్ వణిపోయింది.
