కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై దేశంలోని ప్రతి వర్గం భారీ ఆశలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై దేశంలోని ప్రతి వర్గం భారీ ఆశలు పెట్టుకుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తి బడ్జెట్. దేశంలోని ప్రతి వర్గాన్ని తమవైపు తిప్పుకోవడానికి ప్రభుత్వం వరాల జల్లు కురిపించడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా కీలక ప్రకటనలు వస్తాయని గట్టి నమ్మకంతో ఉన్నారు. కేంద్ర ఉద్యోగులు చాలా కాలంగా జీతాల సవరణకు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే అనేకసార్లు ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలు చర్చలు జరిపాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను సవరించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 నుంచి 3.68 శాతానికి పెంచితే బేసిక్ శాలరీ 8 వేల వరకూ పెరగనుంది. ముందుగా డ్రాఫ్ట్ సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపిస్తారు. ప్రభుత్వం ఆమోదం లభిస్తే.. 52 లక్షల కంటే ఎక్కువమంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్ శాలరీలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెరగనుంది.

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 నుంచి 3.68 శాతానికి పెంచితే.. ఉద్యోగుల బేసిక్ శాలరీ 18 వేల నుంచి 26 వేలకు చేరుతుంది. ఇంతకుముందు అంటే 2017లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగుల బేసిక్ శాలరీ పెరిగింది. కానీ ఆ తరువాత ఇందులో ఏ విధమైన మార్పులు రాలేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ శాలరీ 18 వేల రూపాయలుగా ఉంది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు మరో ఏడాది పట్టే అవకాశం ఉండడంతో బడ్జెట్ 2023లో దాని ఫార్ములాను సమర్పించవచ్చు. ఆర్థిక మంత్రి ఈ ఏడాది బడ్జెట్ ప్రసంగంలో ఉద్యోగుల వేతన సవరణ సూత్రాన్ని చేర్చవచ్చు. ప్రభుత్వం ఇలా చేస్తే కేంద్ర ఉద్యోగుల్లో చిన్న చిన్న స్థానాల్లో పనిచేసే వారికి కూడా పెద్ద ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 శాతం ప్రకారం.. ఇప్పుడు రూ.18 వేల బేసిక్ శాలరీకి ఇతర అలవెన్స్‌లను జోడిస్తే.. రూ.18,000 X2.57= రూ.46,260 వస్తుంది. అది 3.68 శాతానికి పెరిగితే.. ఉద్యోగులకు ఇతర అలవెన్సులు కలిపితే.. జీతం 26,000X3.68 = రూ.95,680 అవుతుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంపుపై కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా నిర్ణయం తీసుకుంటుందని ఉద్యోగులు ధీమాతో ఉన్నారు.

Editor