మహారాష్ట్రలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు త్వరలోనే శుభవార్త వచ్చే అవకాశం కనిపిస్తోంది. పాత పెన్షన్ పథకంపై మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూల వైఖరిని ప్రదర్శిస్తోంది. ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానంపై తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని సీఎం ఏక్నాథ్ షిండే అన్నారు. మహారాష్ట్ర విద్యాశాఖ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)పై అధ్యయనం చేస్తోందని ఆయన తెలిపారు. మహారాష్ట్రలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు త్వరలో శుభవార్త వస్తుందని ముఖ్యమంత్రి ప్రకటనతో అర్థమవుతోంది. రాబోయే శాసన మండలి ఎన్నికలకు సంబంధించిన ర్యాలీలో ప్రసంగించేందుకు సీఎం ఏక్నాథ్ షిండే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం, ఇంగ్లీషు మీడియం పాఠశాలలు, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని అన్నారు. ప్రస్తుతం ఓపీఎస్పై విద్యాశాఖ అధ్యయనం చేస్తోందన్నారు.
మహారాష్ట్రలో పరిశ్రమలు స్థాపించాలనుకునే పెట్టుబడిదారులకు తమ ప్రభుత్వం మెరుగైన మౌలిక సదుపాయాలు, రాయితీలు కల్పిస్తుందని అంతకుముందు సీఎం ఏక్నాథ్ షిండే చెప్పారు. దావోస్ సమ్మిట్లో భారత్, మహారాష్ట్రలపై పెట్టుబడిదారులు ఆసక్తి కనబరిచారని అన్నారు. పెట్టుబడిదారులకు ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, ఎందుకంటే పెట్టుబడులకు చాలా అవకాశాలు ఉన్నాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దావోస్ సదస్సులో పెట్టుబడుల ప్రతిపాదనలపై సంతకాలు చేయడంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం తనదైన పనితో సమాధానం చెబుతుందని స్పష్టం చేశారు. దావోస్ సమావేశం గురించి ఆయన మాట్లాడుతూ.. కొన్ని విదేశీ కంపెనీలు నేరుగా పెట్టుబడులు పెట్టే బదులు జాయింట్ వెంచర్లలోకి వెళ్లేందుకు ఇష్టపడతాయని అన్నారు. దావోస్ సదస్సులో భారత్ నుంచి పలువురు పారిశ్రామికవేత్తలు వస్తున్నారని.. అయితే అది విదేశీ పెట్టుబడులేనని ఆయన అన్నారు. గత మహా వికాస్ అఘాడి (ఎంవీఎ) ప్రభుత్వం సంతకం చేసిన ఒప్పందాలను కూడా గుర్తు చేశారు. ఆ ప్రభుత్వంలో ఏమీ జరగలేదన్నారు.
