సరిహద్దులో చైనా మాస్టర్ ప్లాన్.. సీక్రెట్‌గా ఆనకట్ట నిర్మాణం

చైనా మరోసారి సరిహద్దులో దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. భారత్-నేపాల్‌తో సరిహద్దుకు సమీపంలో గంగానది ఉపనదిపై టిబెట్‌లో చైనా కొత్త ఆనకట్టను నిర్మిస్తున్నట్లు కొత్త ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. ఇటీవల మరొక ఉపగ్రహ చిత్రం బయటకు వచ్చింది. ఇది ఎల్ఏసీ తూర్పు, పశ్చిమ రంగాలలో సైనిక, మౌలిక సదుపాయాలు, గ్రామాల నిర్మాణంలో చైనా వేగంగా పనిచేయడం ప్రారంభించినట్లు ఈ చిత్రం కనిపిస్తోంది. ఇంటెల్ ల్యాబ్స్‌లోని జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ గురువారం ట్విట్టర్‌లో ఈ చిత్రాలను షేర్ చేశారు. మే 2021 నుంచి చైనా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. టిబెట్‌లోని బురాంగ్ కౌంటీలో మబ్జా జాంగ్బో నదిపై ఆనకట్టను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్, నేపాల్‌తో చైనా సరిహద్దు ట్రైసెక్షన్‌కు ఉత్తరాన కొన్ని కిలోమీటర్ల దూరంలో ఆనకట్ట ఉందని పరిశోధకుడు డామియన్ సైమన్ తెలిపారు. కొత్త ఉపగ్రహ చిత్రాల ప్రకారం.. ఆనకట్ట 350 మీటర్ల నుంచి 400 మీటర్ల పొడవు ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. నిర్మాణం ఇంకా కొనసాగుతున్నందున దాని ఉద్దేశంపై ఏమీ చెప్పలేమని ఆయన అన్నారు.

అయితే సమీపంలోనే విమానాశ్రయాన్ని కూడా నిర్మిస్తున్నట్లు సైమన్ తెలిపారు. చైనా ప్లాన్ ఏంటి..? భారత్-నేపాల్‌తో చైనా సరిహద్దుల వ్యూహాత్మక ట్రై-జంక్షన్ వద్ద ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కాలాపానీ ప్రాంతానికి ఎదురుగా ఉన్న ఈ ఆనకట్ట మబ్జా జాంగ్బో నది నుంచి నీటిని మళ్లించడానికి లేదా పరిమితం చేయడానికి ఈ ఆనకట్టను నిర్మిస్తున్నట్లు సమాచారం. డ్యామ్‌లో నీటిని నిల్వ చేసేందుకు కూడా ఉపయోగించవచ్చని.. నీటిని విడుదల చేయడం వల్ల దిగువకు వరదలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. చైనా ఇటీవల కాలంలో యార్లంగ్ జాంగ్బో నదిపై అనేక చిన్న ఆనకట్టలను నిర్మించింది. అదేవిధంగా ఎల్ఏసీలోని అనేక ప్రాంతాల్లో చైనా డజన్ల కొద్దీ గ్రామాలను నిర్మించింది. వివాదాస్పద సరిహద్దు వెంబడి భూభాగంపై తన వాదనను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ చర్య తీసుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో ఎల్ఏసీపై శాంతి లేకుండా.. చైనాతో సంబంధాలు సాధారణంగా ఉండవని భారత నాయకత్వం పేర్కొంది. మరోవైపు ఇరు దేశాలు సరిహద్దు సమస్యను సరైన స్థలంలో ఉంచుకోవాలని.. తమ సంబంధాలలో ముందుకు సాగాలని చైనా చెబుతోంది.

Editor