భారీ షాకిచ్చిన స్విగ్గీ.. 380 ఉద్యోగులు ఔట్!

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్‌ ‘స్విగ్గీ’ కఠిన నిర్ణయం తీసుకుంది. 380 మంది ఉద్యోగులను తొలగించింది. ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు ఈ రోజు ఉదయం ఈ-మెయిల్‌ చేశారు. సంస్థను రీ స్ట్రక్చర్ చేస్తున్న తరుణంలో ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్విగ్గీ సీఈఓ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినందుకు చాలా చింతిస్తున్నామని ఈ-మెయిల్‌లో కంపెనీ పేర్కొంది. మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, ట్విటర్‌ వంటి ప్రముఖ సంస్థలు తమ ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ‘స్విగ్గీ సంస్థ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునేందుకు ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాం. ఇందుకోసం ప్రతిభగల 380 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాం. ఎన్నో అవకాశాలను అన్వేషించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. దీనిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను’ అని స్విగ్గీ సీఈఓ ఉద్యోగులకు ఈ-మెయిల్ చేశారు.

మాంసం విక్రయాల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగాన్ని మూసివేస్తున్నామని, ఇన్‌స్టామార్ట్‌ ద్వారా ఆ విక్రయాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. కొత్త విభాగాల్లో తమ పెట్టుబడులు కొనసాగుతాయని చెప్పుకొచ్చారు. ప్రొడక్ట్‌, ఇంజినీరింగ్‌, ఆపరేషన్‌ డిపార్ట్‌మెంట్స్‌లో ఈ ఉద్యోగాల కోత ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఐపీఓకు ముందు కంపెనీని లాభాల్లోకి తీసుకురావడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టనుందని తెలిసింది. ప్రస్తుతం స్విగ్గీ నష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 2021లో రూ. 1,617 కోట్లుగా ఉన్న నష్టాలు.. 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 3,628.90 కోట్లకు చేరాయి. స్విగ్గీ తన మార్కెట్‌ వాటాను సైతం జొమాటోకు కోల్పోతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. హైదరాబాద్ నగరంలోని స్విగ్గీ ఉద్యోగి కుక్క భారి నుంచి తప్పించుకునే క్రమంలో మూడవ అంతస్తు నుంచి దూకి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన తరవాత స్విగ్గీ 2023 జనవరి 16 నుంచి అత్యవసర పరిస్థితుల్లో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, వారిపై ఆధారపడిన వారందరికీ ఉచిత అంబులెన్స్ సేవను ప్రారంభించింది. డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు అంబులెన్స్ సేవల కోసం 1800 267 4242 టోల్ ఫ్రీ నెంబరుకు కాల్ చేయవచ్చు.

Editor