సీఎం కేసీఆర్ అన్ని పార్టీల్లో తన మనుషులను పెట్టి అల్లకల్లోలం సృష్టించాలని చూస్తున్నారని.. వారిని గుర్తిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రానిఇకి కాపలాకుక్కల ఉంటా అన్న కేసీఆర్ అందలం ఎక్కి అణచివేస్తున్నారని ఫైర్ అయ్యారు. దళిత ముఖ్యమంత్రి చేస్తానని చేయలేదని.. దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వలేదన్నారు. దళితబంధు హుజురాబాద్లోనే పూర్తిగా ఇవ్వలేదని మండిపడ్డారు. కేసీఆర్ మోసపు మాటలు చెప్పి ఓట్లు దన్నుకున్నారని.. ఇదే మోడల్ దేశమంతా ఇస్తావా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మీటింగ్పై ఈటల మీడియాతో మాట్లాడారు. ‘దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వకపోగా.. ఎప్పుడో ఇచ్చిన భూములు లాండ్ బ్రోకర్లాగా మారి 5200 ఎకరాల అసైన్డ్ భుములు లాక్కున్నారు. నీకు ఓటు వేసి గెలిపించిన గజ్వేల్లో కూడా భూమి లాక్కున్నారు.. దీనిపై చర్చకు సిద్ధమా..? ప్రైవేటీకరణ చేస్తున్నారని కేంద్రాన్ని విమర్శిస్తున్నారు. అజంజాహీ మిల్లు.. ఎందుకు ఓపెన్ చేయలేదు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూసి వేయించింది నువ్వు కాదా..? పేదల రవాణా వ్యవస్థ ఆర్టీసీని కేసీఆర్ నాశనం చేస్తున్నారు.
తెలంగాణ వచ్చినప్పుడు 10,300 బస్సులు ఉంటే.. 1000 ప్రైవేట్ బస్సులు ఉండేవి. కానీ ఈరోజు 9 వేల బస్సులు అయ్యాయి. ఇందులో 6 వేలు ప్రభుత్వ బస్సులు అయితే.. ప్రైవేట్ 3 వేలు.. అంటే ప్రైవేట్ పరం చేస్తుంది ఎవరు..? దీనిమీద ఎక్కడ అంటే అక్కడ సీఎం కేసీఆర్తో చర్చకు సిద్దం. నంగనాచి మాటలు చెప్పే.. నువ్వా కేంద్రాన్ని నిందించేది. గిరిజనుల పోడు భూములను లాక్కున్నారు. ఇదే దేశమంతా అప్లై చేస్తావా..? ఎనిమిది సంవత్సరాలు లేనిది మునుగోడు ఎన్నికల్లో ఎలా గిరిజనులకు రిజర్వేషన్ ఇచ్చారు. మీ ప్రేమ ఓట్ల మీద కాదా..?’ అని ఈటల ప్రశ్నల వర్షం కురిపించారు. కూట్లో రాయి తీయలేనివారు ఎట్లో రాయి తీయడానికి పోతున్నట్లు ఉంది కేసీఆర్ పరిస్థితి అని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుగా నీ కుటుంబం తప్ప ఎవరన్నా ఉంటారా..? అని నిలదీశారు. కాళ్లుపైకి పెట్టి తల కిందకు పెట్టినా.. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల హృదయాలు గెలవలేరని అన్నారు. కేసీఆర్ పగటికలలు కంటున్నారని విమర్శించారు. మోసపు మాటలు నమ్మడానికి ప్రజలు సిద్దంగా లేరని ఈటల అన్నారు.
