సీఎం జగన్ మోహన్ రెడ్డి చూసి కొందరు భౌ..భౌ.. అని అరుస్తున్నారంటూ మంత్రి రోజా సెటైర్లు వేశారు. అల్పులే భౌ భౌ అని అరుస్తారని అన్నారు. వారి అరుపులు, వారు ఊగిపోవడాలు చూస్తుంటే ఒక పద్యం గుర్తొస్తోందంటూ.. వేమన పద్యం గుర్తుచేశారు. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను, సజ్జనుండు పలుకు చల్లగాను.. కంచు మోగినట్లు కనకంబు మోగునా.. అంటూ పద్యం చదివి వినిపించారు. సీఎం జగన్ సజ్జనుడు అయితే.. అల్పులు మాత్రం చాలా మంది ఉన్నారని అన్నారు. యోగివేమన జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా కటారుపల్లిలో గురువారం వేమన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. వారంతా గుంపులు గుంపులుగా వస్తున్నారని.. ఎవరెంతమంది కలిసొచ్చినా సింహం సింగిల్గానే వస్తుందన్నారు. వారంతా వీకెండ్ పొలిటీషియన్స్ మాత్రమేనని విమర్శించారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను సీఎం జగన్ చూసి చలించిపోయి ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలని సంక్షేమానికి నడుం బిగించారని అన్నారు.
తల్లిదండ్రులను పట్టించుకోని నేటి సమాజం గురించి ఆనాడే వేమన తన పద్యాల్లో వర్ణించారని కొనియాడారు. మన సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించే తెలుగమ్మాయిగా తనకు పర్యటక శాఖ మంత్రి పదవినిచ్చారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వేమన జయంతి ఉత్సవాలను నిర్వహించడం ఎంతో గొప్ప విషయమన్నారు మంత్రి రోజా. 350 సంవత్సరాలైనా ఇప్పటికీ వేమన పద్యాలను నేటి పరిస్థితులకు అనుగుణంగా బేరీజు వేసుకుంటున్నామంటే వేమన ఘనత ఎంత గొప్పదో మనకు అర్థమవుతుందన్నారు. ఆయన ఎంతో గొప్ప ప్రజాకవి, సామాజిక విప్లవకవి అని.. ఆయనలో ఒక తాత్వికుడు ఉన్నారని ఆయన పద్యాలు నిరూపిస్తాయన్నారు. పండితులతో పాటు పామరులు కూడా మెచ్చిన పద్యాలను వేమన రాశారని కొనియాడారు. వేమన పుట్టిన తెలుగు గడ్డపై మనమూ పుట్టడం మన అదృష్టంగా భావించాలని అన్నారు. 17వ శతాబ్దం నుంచి ఇప్పటివరకు ఆయన పద్యాలను నెమరేసుకుంటున్నారంటే ఇంతకన్నా వేమన గురించి చెప్పాల్సిన పనిలేదన్నారు. ప్రపంచంలోని తెలుగువారందరికీ వేమన గురించి తెలిసేవిధంగా ఈ జయంతి వేడుకలను ముఖ్యమంత్రి జగన్ ఆశీస్సులతో నిర్వహించడం కొనియాడదగిన విషయమని ఆమె అన్నారు.
