దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్‌: సీఎం కేసీఆర్‌

జాతీయ పార్టీగా అవతరించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తొలి సారిగా ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సభలో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ బీజేపీపై మండిపడ్డారు. దేశంలో 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నా.. బకెట్‌ నీళ్ల కోసం చెన్నై నగరం అర్రులు చాస్తోందన్నారు. భారత దేశంలో అతిపెద్దదైన ఒక్క రిజర్వాయర్‌ ఉందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశంలో రైతులకు ఉచిత కరెంట్‌ ఇస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఖమ్మం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… ‘ఖమ్మం సభ దేశంలో ప్రబల మార్పునకు సంకేతం. ఖమ్మం చరిత్రలోనే ఇది అద్భుత భారీ బహిరంగ సభ. బీఆర్ఎస్ విధానం, వ్యూహం గురించి తర్వాత చెబుతా. భారత్‌ అన్ని విధాలా సుసంపన్నమైన దేశం. జలవనరులు, సాగు భూమి విషయంలో ముందంజలో ఉంది. దేశంలో 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నా.. కేవలం 20 వేల టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నాం. బకెట్‌ నీళ్ల కోసం చెన్నై ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. చైనాలో 5 వేల టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్‌ ఉంది. మన దగ్గర అతిపెద్ద ఒక్క రిజర్వాయర్‌ ఉందా?. రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాల అవసరం ఎందుకు వచ్చింది’ అని ప్రశ్నించారు.

‘కెనడా నుంచి కంది పప్పు దిగుమతి చేసుకోవడం సిగ్గు చేటు కాదా. లక్ష కోట్ల విలువైన పామాయిల్‌ దిగుమతి చేసుకుంటున్నాం. దేశానికి నిర్దిష్ట లక్ష్యం లేకుండా పోయింది. ఇక్కడ అందుబాటులో ఉన్న విద్యుత్‌ 4.10 లక్షల మెగావాట్లు. దేశం ఎప్పుడూ కూడా 2.10 లక్షల కోట్ల మెగావాట్లు మించి వాడలేదు. రోజూ వేలాది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నందుకు మనం సిగ్గుపడాలి. వీటన్నింటిని రూపుమాపేందుకే బీఆర్ఎస్ ఆవిర్భవించింది. ఈ దుస్థితికి కాంగ్రెస్‌, బీజేపీనే కారణం. కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే.. బీజేపీని తిడుతుంది. బీజేపీ అధికారంలో ఉంటే.. కాంగ్రెస్‌ను తిడుతుంది’ అని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. రెండేళ్లలో వెలుగు జిలుగుల భారత్‌ను తయారు చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో రైతులకు ఉచిత కరెంట్‌ ఇవ్వాల్సిందేనాని, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా ఉచిత విద్యుత్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. రైతు బంధు స్కీమ్‌ దేశమంతా అమలు చేయాలన్నదే బీఆర్ఎస్ విధానమన్నారు సీఎం కేసీఆర్‌. ఈ సభకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, కేరళ సీఎం పినరయి విజయన్‌, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ తదితరులు వచ్చారు.

Editor