తెలంగాణ విద్యాశాఖలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. బదిలీలు, ప్రమోషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంక్రాంతి పండుగను రెట్టించిన ఉత్సాహంతో జరుపుకున్నారు. అదేవిధంగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసి.. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా త్వరలోనే గుడ్న్యూస్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. పదోన్నతలు, ట్రాన్స్ఫర్ల తరువాత భారీగా ఖాళీలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఉన్నవాటితో పాటు ఆ తరువాత ఏర్పడే ఖాళీలను కలుపుకుని మొత్తం 23 వేల టీచర్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. వివిధ శాఖల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 13 వేల వరకు భర్తీ చేయాల్సి ఉందని ప్రకటించింది. అయితే ఇతర శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చినా.. టీచర్ పోస్టులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు తరువాత ఎన్ని ఖాళీలు తేలుతాయో పరిశీలించి.. ఆ తరువాత నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, హరీష్ రావు, ఉన్నత అధికారులతో టీటీజేఏసీ నాయకులు సమావేశం అయ్యారు. పదోన్నతులకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు షెడ్యూల్ విడుదలకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో 9,266 మందికి ప్రమోషన్స్ ఇవ్వబోతున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. దీంతో రాష్ట్రంలో 10 వేల ఖాళీలు ఏర్పడబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో 9 వేల ఎస్జీటీ పోస్టులు, మరో వెయి వరకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండే అవకాశం ఉందని ఉపాధ్యాయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే 13 వేల పోస్టులు ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వం చెప్పగా.. పదోన్నతుల తరువాత 10 వేల పోస్టులు ఖాళీగా కానున్నాయి. దీంతో మొత్తం 23 వేల పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఒకేసారి మెగా మేళా నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని చెబుతున్నారు. ఈ పోస్టులు మొత్తం డీఎస్సీ ద్వారానే భర్తీ చేయనున్నారు. బదిలీలు, ప్రమోషన్ల తరువాత నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
