సినీ నటుడు, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ సంచలన వ్యాఖ్యలు

సినీ నటుడు, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశిస్తే.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై పోటీకి సిద్ధమని ప్రకటించారు. ముఖ్యమంత్రి చెబితే తాను ఎవరిపై అయినా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా నగరిలో మంగళవారం పర్యటించిన అలీ.. ఈ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రానికి ఎవరు మేలు చేస్తారో ప్రజలకు బాగా తెలుసన్నారు అలీ. పవన్ కళ్యాణ్ తనకు మంచి మిత్రుడేనని.. కానీ సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం తథ్యమని జోస్యం చెప్పారు. 175 సీట్లలో వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి రోజా ఫైర్ బ్రాండ్ అని.. ఆమె ఎక్కడా తగ్గదన్నారు. రోజాను డైమాండ్ రాణితో పోల్చారు.. డైమాండ్‌తో పోల్చడం అంటే ఎంతో విలువైనదిగా పోల్చడమేనని అన్నారు.

కమెడియన్‌గా, నటుడిగా ఎన్నో వందల సినిమాల్లో ప్రేక్షకులను అలరించిన అలీ.. 2019 ఎన్నికల ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పుడే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రయత్నించినా కుదరలేదు. అయితే పార్టీ విజయానికి అలీ జోరుగా ప్రచారం చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే అలీ పదవి ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే మొదట్లో పదవి దక్కలేదు. దీంతో ఆయన మళ్లీ జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలను అలీ ఖండించారు. తాను ఎట్టిపరిస్థితుల్లోనూ వైసీపీని వీడే ప్రసక్తి లేదని స్పష్టంచేశారు. తాను పదవుల కోసం వైసీపీలో చేరలేదని.. జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకే చేరానని అన్నారు. జగన్‌ను సీఎం చేసేందుకు మళ్లీ కృషి చేస్తానని చెప్పారు. ఈ క్రమంలోనే గతేడాది అక్టోబర్‌లో అలీకి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా అలీ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పవన్‌కు, అలీకి ఉన్న స్నేహం అందరికీ తెలిసిందే.

Editor