ఎన్నో ఏళ్లుగా భారత్ – నేపాల్ మధ్య సామాజిక, భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీతారాముల జన్మస్థలాలుగా భావించే నేపాల్లోని జనక్పుర్, భారత్లోని అయోధ్యలను కలుపుతూ ప్రత్యేక రైలును నడపనున్నట్లు ఐఆర్సీటీసీ ప్రకటించింది. దీనికి ‘శ్రీరామ్-జానకి యాత్ర’ అనే పేరు పెట్టారు. కేంద్రం ఇచ్చిన ఇచ్చిన ”దేఖో అప్నాదేశ్” పిలుపునకు అనుగుణంగా ఈ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును ఫిబ్రవరి 17న ఢిల్లీ నుంచి ప్రారంభించనున్నారు. ఈ టూర్ ఏడు రోజులపాటు ఉంటుంది. IRCTC ట్రావెల్ ప్యాకేజీల ద్వారా దేశంలోని వివిధ గమ్యస్థానాలకు ఎప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే భారత్ గౌరవ్ రైళ్లు ప్రవేశపెట్టారు. ఈ పర్యాటక రైలు నందిగ్రామ్, సీతామర్హి, కాశీ మరియు ప్రయాగ్రాజ్లను కవర్ చేస్తుంది. జనక్పూర్, వారణాసిలోని ఓ హోటల్లో 2 రాత్రులు బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తారు.
ప్రయాణం ఏయే మార్గాల ద్వారా సాగుతుందంటే.. ఏడు రోజుల భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ప్రయాణంలో మొదటి స్టాప్ శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య. అయోధ్య తర్వాత రైలు బీహార్లోని సీతామర్హి రైల్వే స్టేషన్కు వెళ్తుంది. అక్కడ నుంచి పర్యాటకులను బస్సులలో నేపాల్లోని జనక్పూర్కు తీసుకెళతారు. ఒక్కొక్కరికి రూ.39,775 ఐఆర్సీటీసీ ఈ 7 రోజుల ప్రయాణానికి ప్రతి వ్యక్తికి రూ. 39,775గా ధర నిర్ణయించింది. ఈ పర్యటనలో ఏసీ రైలు ప్రయాణం, శాఖాహారం, బస్సుల ద్వారా సందర్శనా స్థలాలు, ఏసీ హోటళ్లలో వసతి, గైడ్ మరియు బీమా ఉన్నాయి. అంతేకాకుండా ఈ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలులో రెండు ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లు, ఆధునిక వంటగది, సెన్సార్ ఆధారిత వాష్రూమ్ ఫంక్షన్, ఫుట్ మసాజర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇది 1వ ఏసీ మరియు మరొక 2వ ఏసీ కోచ్తో కూడిన ఎయిర్ కండిషన్డ్ రైలు. ప్రతి కోచ్లో సీసీటీవీ, సెక్యూరిటీ గార్డులు ఉంటాయి. అంతేకాకుండా మొత్తం రైలులో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేశారు.
