పడిపోతున్న ఢిల్లీ ఉష్ణోగ్రతలు.. నేటి నుంచి మరో ‘కోల్డ్‌ స్పెల్‌’!

దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు మరోసారి పడిపోతున్నాయి. సోమవారం (2023 జనవరి 16) నుంచి మూడు రోజుల పాటు మరో ‘కోల్డ్‌ స్పెల్‌’ ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఓ ప్రకటనలో వెల్లడించింది. కోల్డ్‌ స్పెల్‌ కారణంగా హస్తినలో మూడు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఐఎండీ తెలిపింది. వరుసగా కొన్ని రోజుల పాటు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే.. దాన్ని ‘కోల్డ్‌ స్పెల్‌’ అంటారన్న విషయం తెలిసిందే. 2023 జనవరి 5 నుంచి 9 తేదీల మధ్య ఏర్పడిన కోల్డ్‌ స్పెల్‌ కారణంగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన పదేళ్లలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇది రెండోసారి మాత్రమే. ఐఎండీ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 15 రోజుల్లో 50 గంటల పాటు పొగమంచు కురిసింది.

2019 తర్వాత ఇంత మొత్తంలో మంచు కురవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఢిల్లీ ప్రజలు చలితో వణికిపోతున్నారు. బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. వాయవ్య ప్రాంతం మీదుగా వస్తున్న గాలులతో ఢిల్లీ ఉష్ణోగ్రతలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. రానున్న 5 రోజుల్లో ఢిల్లీతో పాటు పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో దట్టమైన మంచు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ తెలిపింది. జనవరి 18 వరకు ఈ ప్రాంతాల్లో రెండు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. జనవరి 18 తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశముందని ఐఎండీ పేర్కొంది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది.

Editor